బంగ్లాదేశ్ టు హైదరాబాద్: అమ్మాయిల అక్రమ రవాణా, బానిస కూలీలుగా, మసాజ్ పార్లర్లలో, వ్యభిచారం!
హైదరాబాద్: కడు పేదరికం.. వారిని ఉపాధి బాటవైపు నడిపిస్తోంది. భారతదేశంలో ఉపాధి లభిస్తుందనే గంపెడాశతో దేశ సరిహద్దులు దాటి వస్తున్న వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించకపోగా.. కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి.
నాలుగేళ్లు నరకం: రోజూ 30 మంది.. ఆమెను 43 వేలసార్లు రేప్ చేశారు!
కొన్ని ముఠాలు వారిని అక్రమంగా భారతదేశంలోని కోల్కతా, హైదరాబాద్ వంటి నగరాలకు తరలించి వారిని బానిస కూలీలుగా, ఇళ్లల్లో పనిమనుషులుగా మార్చేస్తున్నాయి. కాస్త అందంగా కనిపించే వారిని డ్యాన్స్ బార్లు, మసాజ్ పార్లర్లు, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. ఇదీ బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వలస వస్తున్న యువతుల గాథ!
జీహాదీలకు సెక్స్ బానిసల ఎర, ఉత్తేజం కోసం విశృంఖల ధోరణులు...
ఛిద్రమవుతున్న మహిళలు, యువతుల జీవితాలు...
బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా రవాణా అవుతున్న మహిళలు, యువతులు హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్టు తేలింది. ఈ విషయంలో ముంబై తర్వాతి స్థానం మన నగరానిదే కావడం గమనార్హం. ఇలా హైదరాబాద్ చేరుతున్న మహిళలు, యువతులకు శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలు, డ్యాన్స్ బార్లు, మసాజ్ పార్లర్లు, వ్యభిచార గృహాలే అడ్డాలుగా మారుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) వెల్లడించింది.
14 ఏళ్ల వయసులోనే మొదలు.. ఇప్పటికి వేలసార్లు రేప్... ఎన్నో అబార్షన్లు.. ఓ యువతి కన్నీటిగాథ!
నగర పోలీసులకు బీఎస్ఎఫ్ హెచ్చరిక...
బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఇలా అక్రమంగా రవాణా అవుతోన్న మహిళలు, యువతుల పరిస్థితిపై మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ అనేక ఎన్జీవోల సహకారం కూడా తీసుకుంది. ఈ అధ్యయనం ఆధారంగా ‘హ్యూమన్ ట్రాఫికింగ్: మోడెస్ ఆపరెండీ ఆఫ్ టాట్స్ ఆన్ ఇండో-బంగ్లాదేశ్ బోర్డర్' నివేదికను రూపొందించింది. అంతేకాదు, ఈ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, హైదరాబాద్లో అక్రమంగా తిష్టవేస్తున్న బంగ్లాదేశీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ నగర పోలీసు విభాగాన్ని కూడా బీఎస్ఎఫ్ హెచ్చరించింది.
ఏటా 50 వేల మంది యువతులు, బాలికలు...
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నివేదిక ప్రకారం ప్రతీయేటా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి కనీసం 50 వేల మంది మహిళలు, యువతులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇలా గత దశాబ్ద కాలంలో దాదాపు 5 లక్షల మంది బంగ్లాదేశీయులు భారత్లోకి ప్రవేశించారు. వీరిలో 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండే బాలికలు, యువతులే ఎక్కువగా ఉంటున్నారు. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుల్లో మాటు వేసిన కొన్ని ముఠాలు ఈ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేంద్రంగా ఈ ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కడుపేదరికంతో బాధపడుతున్న బంగ్లా మహిళలు, యువతులను తొలుత కోల్కతాకు రప్పించి అక్కడ్నించి ముంబై, హైదరాబాద్, ఇంకా పాలు ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
మహిళా దళారులు మాయమాటలు చెప్పి...
ఈ మానవ అక్రమ రవాణా ముఠాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మొదలుకొని భారత్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల వరకు కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకుని ఓక సిండికేట్గా మారి ఈ మానవ అక్రమ రవాణాను సాగిస్తున్నాయి. ఈ దళారుల్లో 16 శాతం మహిళలు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్లోని మహిళలు, యువతులను ఈ దళారులు ట్రాప్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. భారత్లో జీవన విధానం బాగుంటుందని, మంచి ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలుకుతున్నారు. ఇంటి పనులు చేసే వారికి మంచి డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు.
అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారిని...
బంగ్లాదేశ్లో పేదరికంగా మగ్గుతూ.. కాస్త అందంగా.. ఆకర్షణీయంగా ఉన్న యువతులకు ఈ దళారులు సినిమాల్లో అవకాశాల పేరుతో ఎర వేస్తున్నారు. అంతేకాదు, భారత్లో అబ్బాయిలు బాగుంటారని, ప్రేమించి పెళ్లిచేసుకోవచ్చంటూ లేనిపోని ఆశలు కల్పించి.. దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. ప్రధానంగా బంగ్లాదేశ్ గ్రామాల్లోని నిరుపేద అమ్మాయిలే వీరికి టార్గెట్గా మారుతున్నారు. ఇలా మోసపోతున్న వారిలో జెసోర్, సత్ఖారీ, గోజడాంగ, హకీంపుర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. బంగ్లా-భారత్ సరిహద్దుల్లో సరైన కంచె లేకపోవడం, ‘జీరోలైన్'గా పిలిచే ఇతర దేశ సరిహద్దు ప్రాంతం సమీపం వరకు జనావాసాలు విస్తరించడం ఈ మానవ అక్రమ రవాణా ముఠాల కార్యకలాపాలకు బాగా కలిసొస్తోంది.
దళారులకు బీజీబీ సహకారం...
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్ నుంచి జరుగుతోన్న ఈ మానవ అక్రమ రవాణా వ్యవహారంలో సిండికేట్లకు, దళారులకు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ) సహకరిస్తుండడం. దళారుల వద్ద ఒక్కో యువతికి 200 నుంచి 400 టాకాల వరకు వసూలు చేస్తూ వీరు సరిహద్దులు దాటించేస్తున్నారు. బంగ్లాదేశ్లోని కూరిగ్రామ్, లాల్మొన్నీర్హత్, నీల్ఫామారి, పంమఘార్, థకూర్గావ్, దినజ్ప్పూర్, నావ్గావ్, చపాయ్ నవాజ్గంజ్, రాజ్షహీ జిల్లాలు.. పశ్చిమ బెంగాల్లోని బినొపొల్ ప్రాంతాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటు బంగ్లా, ఇటు భారత్కు చెందిన వ్యవస్థీకృత ముఠాలు పక్కా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఈ మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి.
కొన్నాళ్లు సరిహద్దు గ్రామాల్లోనే ఉంచి...
మానవ అక్రమ రవాణా ముఠాల బారినపడి ఎంతోమంది బంగ్లా మహిళలు, యువతులు, బాలికలు భారత్లోకి ప్రవేస్తున్నారు. భారత్లోకి ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ల పాటు వీరిని సరిహద్దు గ్రామాల్లోనే ఈ ముఠాలు దాచి ఉంచుతున్నాయి. ఆ తరువాత దేశంలోని వివిధ నగరాల్లో ఉండే తమ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఇలా భారత్ చేరిన వారిలో ఎక్కువ మంది మహిళలు యువతులు ముంబైకి చేరుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుస్తున్నారు. బెంగళూరు, రాయ్పూర్, సూరత్లకూ పెద్ద సంఖ్యలో వీరు చేరుతున్నట్లు బీఎస్ఎఫ్ తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో విభిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నందున బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చేరుతున్న యువతలును స్థానికులు పెద్దగా గుర్తించడం లేదు. దీంతో వారు తేలిగ్గానే ఇక్కడి వారితో కలిసిపోతున్నారు.
అడ్డదారుల్లో గుర్తింపు కార్డులు పొందుతూ....
హైదరాబాద్ నగర శివార్లలో ఉండే పారిశ్రామిక ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఎంతోకాలంగా ఆశ్రయం కల్పిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశీయులు కూడా ఈ ముసుగులో ఇక్కడ స్థిరపడిపోతున్నారు. ఇలా అక్రమంగా తరలివచ్చిన వారికి అవసరమై గుర్తింపు కార్డులు ఇప్పించేందుకు కూడా ఇక్కడ కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ ముఠాల సహకారంతో అడ్డదారిలో ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు వంటివి పొందుతూ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చేరుకున్న మహిళలు, యువతులు స్థానికులుగా చెలామణీ అయిపోతున్నారు. అసలు దళారులు బంగ్లాదేశ్ నుంచి వీరిని భారత్ చేర్చే ముందు చెప్పేదొకటి, తీరా ఇక్కడికొచ్చాక వారు చేస్తుందొకటి. ఉపాధికోసం వచ్చిన యువతులకు ఇక్కడి ఏజెంట్లు బాగా డబ్బున్న వారి ఇళ్లల్లో పనికి కుదుర్చుతున్నారు. మరికొంతమందిని డ్యాన్స్ బార్లలో డ్యాన్సులు చేసేందుకు కుదుర్చుతున్నారు. సినిమాల్లో అవకాశాలంటూ తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్న ఘటనలూ కోకొల్లలు.