కెసిఆర్ అడగనన్నారు: బెంగాల్ అధికారులతో కెటిఆర్, హైదరాబాద్లో అసంతృప్తి
హైదరాబాద్: ఫ్లోరైడ్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలకు మంచినీటిని అందించడానికి తెలంగాణ సర్కార్ చేపట్టిన జలహారం పథకానికి పశ్చిమ బెంగాల్ అధికారులు కితాబిచ్చారు. వాటర్ గ్రిడ్ పథకం అద్భుతంగా ఉందని, మంచినీటిని అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు.
బెంగాల్లోను ఇలాంటి పథకాన్ని ప్రారంభించే యోచనతో... డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించి తెలుసుకునేందుకు మమత ప్రభుత్వం ఓ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపించింది. ఈ బృందం బుధవారం మంత్రి కెటి రామారావుతో క్యాంప్ ఆఫీస్లో భేటీ అయ్యారు.
ఇటీవల యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రాజెక్టు వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా అధికారుల బృందాన్ని పంపించడం గమనార్హం. బెంగాల్ ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు అధికారులు కేటీఆర్తో సమావేశమయ్యారు.
కెటిఆర్తో బెంగాల్ అధికారుల బృందం
ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి వారికి మంత్రి వివరించారు. తెలంగాణ ఆడపడుచులెవరూ మంచినీటికోసం ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును చేపట్టారన్నారు. రానున్న మూడున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారని బెంగాల్ అధికారులకు చెప్పారు.
కెటిఆర్తో బెంగాల్ అధికారుల బృందం
ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అభినందించిందన్నారు. ప్రాజెక్టు నిధుల సమీకరణకు అవలంభించిన విధానాలను అధికారులకు మంత్రి వివరించారు. బెంగాల్లో ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
కెటిఆర్
కార్పోరేట్ సామాజిక బాధ్యతల (సిఎస్ఆర్) కింద వివిధ కంపెనీలు చేపట్టే కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేయడం కోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బుధవారం హైసియా రెండో అంతర్జాతీయ సిఎస్ఆర్ సదస్సు ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.
కెటిఆర్
వివిధ సంస్థలు చేపట్టే సిఎస్ఆర్ కార్యకలాపాల ప్రయోజనాన్ని మరింతగా సమాజానికి అందేలా చూడటం తమ లక్ష్యమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్, నీటి సమస్యల పరిష్కారానికి, గ్రామీణ రోడ్ల అబివృద్ధికి, విద్యావసతుల కల్పనకు భారీ ఎత్తున నిధులు కేటాయించామన్నారు.
కెటిఆర్
ఈ నెల ద్వితీయార్థంలో కృష్ణా మూడో దశ జలాలు, డిసెంబర్ మధ్య నాటికి తదుపరి దశ గోదావరి జలాలు హైదరాబాదుకు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాదులోని రోడ్ల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, డిసెంబర్ చివరికల్లా రోడ్లను మర్మతులు చేయాలని తమ లక్ష్యమని చెప్పారు.