గులాబీ బాస్ పై గుర్రు.!ఉద్యమకారులకు గుర్తింపు ఏది.?జోడు పదవులెందుకు.?ప్రశ్నిస్తున్న ద్వితీయ శ్రేణి.!
హైదరాబాద్ : జిల్లా అద్యక్షపదవుల పంపకాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. అనుభవించిన వారికే మళ్లీ పదవులు కట్టబెడుతున్నారని, అసలైన ఉద్యమకారులను చంద్రశేఖర్ రావు గుర్తించడం లేదని మండిపడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల పదవుల్లో ఉన్నవారికి కూడా జిల్లా అద్యక్షపదవి పేరుతో జోడుపదవులను కట్టబెట్టారని గులాబీ దళతపతిపై ద్వితీయ శ్రేణి నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న రెండవ తరగతి న్యాయకత్వం ఎప్పుడైనా విస్పోటనం చెందే అవకాశం ఉందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది.
పంటికింద రాయిలా జిల్లా అద్యక్షుల ఎంపిక.. కేసీఆర్ పై ద్వితీయ శ్రేణి అసంతృప్తి
జిల్లా అద్యక్షుల ఎంపిక గులాబీ దళపతికి పంటికింద రాయిలా పరిణమించింది. జిల్లా అద్యక్షులు కూర్పులో చంద్రశేఖర్ రావు సమన్యాయం చేయలేకపోయారనే చర్చ నడుస్తోంది. ఎమ్యెల్యే, ఎంపి పదవుల్లో ఉన్న వారికి అసలు జిల్లా అద్యక్షపదవి అవసరం ఉండదు. వారి వారి నియోజక వర్గాల్లో వ్యవహారాలను చక్కదిద్దుకుంటే రెండు మూడు జిల్లాలను చూసుకున్నట్టే లెక్క అనే భావనలో ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రాతినిద్యం వహించే ఓ ఎంపీని రెండు, మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న జిల్లా అద్యక్షుడిని చేయడం ద్వారా సదరు ఎంపీ గౌరవానికి చంద్రశేఖర్ రావు భంగం కలిగించారనే చర్చ జరుగుతోంది.
ఉద్యమ నేతలకు గుర్తింపు ఏది.. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్న గులాబీ నేతలు
అంతే కాకుండా జిల్లా అద్యక్షుల ఎంపికలో సమన్యాయం, సామాజిక న్యాయాన్ని చంద్రశేఖర్ రావు ఏమాత్రం పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైంది తెలంగాణ ఉద్యమంకోసం అలుపెరగని పోరాటం చేసి సర్వం కోల్పియిన అసలైన ఉద్యమకారులకు చంద్రశేఖర్ రావు ఏమాత్రం గుర్తింపు ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు చెప్పుకొస్తున్నారు. ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకుంది ఒకరైతే పదవులు అనుభవిస్తుంది మాత్రం మరొకరా అనే చర్చ లోతుగా జరుగుతోంది.
నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి నేతలు.. ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వొచ్చంటున్న నాయకులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి సారి అవకాశం కల్పించిన అభ్యర్ధులకే మళ్లీ అవకాశం ఇచ్చారు తప్ప కొత్త వారికి, ఉద్యమకారులకు చంద్రశేఖర్ రావు అవకాశం ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది. మొదటి సారి చంద్రశేఖర్ రావు మాట గౌరవించాం, రెండో సారి సహనంగా ఉన్నాం, ఇప్పుడు మూడోసారి కూడా పదవులు దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది ద్వతీయ శ్రేణి నాయకత్వం. జిల్లా అద్యక్షపదవి అనేది జిల్లా కార్యకర్తలకు కుటుంబ పెద్ద వంటి పదవని, ఎంపీ.. ఎమ్మెల్యేలకు ఎంతటి గౌరవం ఉంటుందో జిల్లా అద్యక్షులకు అంతే ఉంటుందని, అలాంటి పదవులను కూడా తమను ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ వ్యూహం లేదు.. అభద్రతా భావంతోనే జిల్లా అద్యక్షుల ఎంపిక అంటున్న జిల్లా నాయకులు
తెలంగాణ 33జిల్లాల అద్యక్షుల ఎంపికలో చంద్రశేఖర్ రావు రాజకీయ వ్యూహం కన్నా అభద్రతాభావం ఎక్కువగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఎమ్మెల్యేలకు జిల్లా అద్యక్షుల పదవులు కట్టబెట్టడమే ఇందుకు పెద్ద ఉదాహణ అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ ప్రజానికంలో మార్పు వచ్చిందని, 2023/24సాధారణ ఎన్నికల్లో ఎలాంటి తీర్పైనా ఇవ్వొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు పార్టీ పగ్గాలు చేపట్టడంతో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపి ఊహించని రీతిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు వీస్తున్న అనుకూల పవనాల ప్రభావంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు వారికి అద్యక్షపదవులు కట్టబెట్టారనే చర్చ కూడా జరుగుతోంది. అంటే రాజకీయ వ్యూహాత్మకంగా కాకుండా అభద్రతా భావంతోనే జిల్లా అద్యక్షులను చంద్రశేఖర్ రావు ఎంపికచేసారనే చర్చ కూడా సాగుతోంది.