మజ్లిస్ అంతరంగం ఏంటి..? కర్ణాటకలో జేడీయస్ లా ఆలోచిస్తోందా..?
హైదరాబాద్ : తెలంగాణ లో మజ్లిస్ పార్టీ వ్యవహారం ఎవరికి అంతుచిక్కడం లేదు. గత ప్రభుత్వంలో అదికార గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దత్తు తెలిపిన ఆ పార్టీ ఈ సారి కూడా అలాగే చేస్తుందనడంలో సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో తమ సహకారం తప్పదనుకుంటున్న మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దత్తు తెలుపుతుందో కూడా ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో ఆసద్ భేటీ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఆహ్వానంపై ఇపుడే స్పందించేది లేదంటున్న అసద్..! టీఆర్ఎస్లో టెన్షన్..!!
కౌంటింగ్కు కొన్ని గంటల ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో ఫలితాలు ఉత్కంఠరేపుతున్నాయి. రాష్ట్రంలో హంగ్ ఏర్పడవచ్చని ఆ సమయంలో మజ్లీస్ మద్దతు కీలకమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్ రోజు వరకు టీఆర్ఎస్కు తాము మిత్రపక్షమని, టీఆర్ఎస్ బండికి తానే ఇంజనని చెప్పుకున్న మజ్లీస్ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ గడిచిన రెండు రోజులుగా ముభావంగా ఉంటున్నారు.
ముఖ్యమంత్రి తో అసద్ ఏం చెబుతారు..! ఉత్కంఠ రేపుతున్న ములాఖత్..!!
దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంఐఎంకు గాలం వేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. . కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని , ప్రభుత్వ ఏర్పాటుకు కలసి రావాలని ఆయనకు సోనియా ఆహ్వానం పలికినట్లు సమాచారం. చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావాలని కోరినట్లుగా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చజరుగుతోంది. కాంగ్రెస్ ఆహ్వానంపై అసదుద్ధీన్ నోరు మెదపడం లేదు.
పరిణామాలపై ఆచితూచి అడుగేస్తున్న ఎంఐఎం..! ఎవరికి అనుకూలమో..!!
దీనిపై ఆదివారం కొందరు మీడియా ప్రతినిధులు ఆయన్ని వివరణ కోరగా ఇప్పుడేమీ మట్లాడలేనన్నారు. ఫలితాలపై వస్తున్న ఊహాగాలన్నీ అర్థరహితమన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. తాజాగా ఎంఐఎం అధినేత చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్లో కలవరం రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ అధికార టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతుండడం ఎంఐఎం నేతలకు శరాఘాతంగా పరిణమించిన విషయం తెలిసిందే..!
అటు బీజెపి.. ఇటు ఎంఐఎం..! గులాబీ పార్టీ వినూత్న ప్రస్థానం..!!
ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రెండు పార్టీల సంబంధాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో వైపు టీఆర్ఎస్కు తాము షరతులతో కూడిన మద్దతు ఇస్తామని బీజేపీ ఆదివారం ప్రకటించడం రాజకీయకలకలం రేకెత్తించింది. ఈ నేపధ్యంలో మజ్లీస్ దారెటూ? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ ఉన్న చోట మజ్లీస్ ఉండదనే వాదన కూడా మజ్లీస్ వర్గాల్లో వినిపిస్తోంది. చివరకు ఈ పొత్తులు ఎటువైపు, ఎవరితో కలిసి ముందకు వెళ్తాయో అనే అంశం ఉత్సుకతను రేకెత్తిస్తోంది.