వైఎస్ షర్మిలపై కేసులు పెట్టేంతగా చేసిన తప్పేంటి? మొత్తం ఎపిసోడ్లో జరిగిందేంటి? హాట్ డిబేట్!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణా లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వైయస్ షర్మిల పై పోలీసులు కేసులు ఎందుకు పెట్టారు? వైయస్ షర్మిల ను అంత బలవంతంగా అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతగా వైయస్ షర్మిల చేసిన తప్పేంటి? వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిల విషయంలో పోలీసుల తీరుపై చర్చ
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, ప్రజా సమస్యల కోసం పోరాటం మొదలు పెట్టారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల ఇప్పటివరకు అనేక నియోజకవర్గాలలో పర్యటించి ప్రజల సమస్యల పైన, కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలపైన, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా వైయస్ షర్మిల పాదయాత్ర విషయంలో పోలీసులు కఠినంగా ప్రవర్తించటం వెనక ఆమె చేసిన తప్పు ఏమైనా ఉందా అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

నర్సంపేట పర్యటనలో వైఎస్ షర్మిల వ్యాఖ్యల ఎఫెక్ట్... ఆమె వాహనాలు ధ్వంసం, దాడి
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఒకప్పుడు ట్రాక్టర్ నడుపుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తాడు అంటూ వైయస్ షర్మిల చేసిన విమర్శలు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు వైయస్ షర్మిల రాత్రి వేళ బస చేసే బస్సును తగలబెట్టటానికి ప్రయత్నించి, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆమె వెంట ఉన్న కార్లను ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. దాడికి యత్నించారు.
శాంతిభద్రతల సమస్య వస్తుందని వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ తర్వాత వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న తమ పై దాడిని ఖండించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగానే ఆమె తన నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి దాడులకు పాల్పడలేదు. అయితే వైయస్ షర్మిల కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలో వైయస్ షర్మిలకు ముఖం మీద గాయం కూడా అయింది. ఇక టిఆర్ఎస్ పార్టీ అంతగా తమ మీద దాడులు చేస్తున్న పోలీసులు తన పాదయాత్రను అడ్డుకుని, తనను అరెస్టు చేసి ఇంటికి పంపించడాన్ని తీవ్రంగా పరిగణించిన వైయస్ షర్మిల టిఆర్ఎస్ నేతలు రౌడీల ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేస్తూ తనకు భద్రత కావాలని కోరుతూ, టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కారులోనే ప్రగతి భవన్ కు బయల్దేరారు.
ప్రగతి భవన్ వెళ్లొద్దని కేసు..కోర్టు రిమాండ్; బెయిల్
ఇక ప్రగతి భవన్ కు వెళ్లొద్దని అడ్డుకున్న పోలీసులు ట్రాఫిక్ కు ఆటంకం కలుగుతుందని కారు దిగాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమె కారు దిగకపోవడంతో క్రేన్ సహాయంతో కారును అక్కడినుండి ఎత్తి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా వైఎస్ షర్మిల కారు దిగడానికి ససేమిరా అనడంతో బలవంతంగా ఆమెను బయటకు తీసుకొచ్చి పోలీసులు షర్మిలపై ఐపీసీ సెక్షన్లు 353, 333, 327 ప్రకారం కేసులు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడి చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అంశాల కింద వైయస్ షర్మిల పై కేసులు పెట్టారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆపై వైయస్ షర్మిల కు బెయిల్ మంజూరు అయింది. మరోవైపు వైయస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. ఈ మొత్తం ఘటనలో వైయస్ షర్మిల ఎవరి పైన దాడి చేసిన దాఖలాలు లేవు. ఇక ఇదే తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

షర్మిల చేసిన తప్పేంటి? తెలంగాణాలో చర్చ
షర్మిల బస్సు తగలబెట్టడానికి ప్రయత్నించి, వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వదిలి పెట్టి, వైయస్ షర్మిలను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసినట్టు? ఆమె పాదయాత్రను చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నట్టు? ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటంలో తప్పేముంది? ఎందుకు ఆమెపై ఈ నిరంకుశ వైఖరి? అన్నది తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలు షర్మిల ఎపిసోడ్లో ఇంతగా ఆమెను వెంటాడి వేటాడి టార్గెట్ చెయ్యాల్సిన అవసరం లేదు అన్న టాక్ వినిపిస్తోంది.

వ్యాఖ్యలకు దాడులు, అరెస్ట్ లా సమాధానం?
ఒక రాజకీయ పార్టీ అధినేత్రి గా తాను చెప్పదలుచుకున్నది ప్రజల మధ్య చెప్పే ప్రయత్నం చేసిన షర్మిల చేసే వ్యాఖ్యలు తప్పైతే వాటిని ఖండించటానికి వేరే విధానం ఉంటుంది. ఒకవేళ వారికి నచ్చకుంటే వారు చెప్పదలుచుకున్న విషయం చెప్తే సరిపోతుంది కదా.. కానీ ఈ దాడులు ఏమిటి అన్నది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఒంటరిగా పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల విషయంలో ఈ తీరు మంచిది కాదనే టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి ప్రస్తుతం చోటు చేసుకున్న తాజా పరిణామాలతో ముందు ముందు వైఎస్ షర్మిల ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications