దుబ్బాక ఉప ఎన్నికకు సాగర్ ఉప ఎన్నికకు ఏంటి తేడా..?సాగర్ లో బీజేపి చతికిల బడడానికి కారణం అదేనా..?
హైదరాబాద్: రాజకీయ ముఖచిత్రంపై ఉరుములా వచ్చి మెరుపులా మాయమయ్యే సంఘటనలు ఎన్నో ఆవిష్కృతమవుతాయి. ఎన్నో ఆశలతో, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కూడా ఇట్టే యూటర్న్ తీసుకున్న సందర్బాలు కూడా ఎన్నో చోటుచేసుకున్నాయి. కొత్తగా వచ్చిన నాయకులు గానీ, కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు గానీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతే ప్రజల్లో నాలుగు రోజులు చర్చ జరుగుతుంది తప్ప పెద్దగా ప్రభావం చూపదు. అదే ఏదైనా జాతీయ రాజకీయ పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తెలంగాణలో నాగార్జున సాగర్, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపి వ్యవహరించిన తీరు అందుకు అద్దం పడుతున్నట్టు తెలుస్తోంది.
దుబ్బాకలో దూసుకెళ్లిన బీజేపి.. సాగర్ లో చతికిల బడ్డ కాషాయ పార్టీ..
అత్యంత ఉత్కంఠ పరస్థితుల మధ్య నాలుగు నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉప పోరులో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణలో తిరుగులేని పార్టీగా బీజేపి అవతరించబోతుంది అనే అంచనాకు వచ్చారు తెలంగాణలోని మెజారిటీ ప్రజానికం. కానీ ఈ అంచనాలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపి ఎందుకు బిస్కెట్ అయ్యిందో ఎవరికి అంతుచిక్కని అంశంగా పరిణమించింది.
సాగర్ లో బోరుమన్న బీజేపి.. డిపాజిట్ గల్లంతు చేసుకున్న కమలం నేతలు..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అసలు గెలుపుకోసం ప్రయత్నాలు చేసిందా.? గెలవాలనే సంకల్పం దృఢంగా ఉంటే సరైన అభ్యర్థిని పోటీలో ఎందుకు నిలబెట్టలేదు..? అభ్యర్ది డమ్మీ అయినప్పుడు ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి అభ్యర్థి గెలుపుకోసం రాష్ట్ర నాయకత్వం ఎందుకు కృషి చేయలేదు..? అసలు ఎన్నిక ప్రచారాన్నే ఓ ప్రణాళికా బద్దంగా నిర్వహించలేకపోవడంతోనే బీజేపి సాగర్ లో డిపిజిట్ కోల్పోయిందా.? దుబ్బాక, జీహెచ్ఎంసీ లో అనుసరించిన వ్యూహాం సాగర్ లో మిస్సయిందా.?అనే ప్రశ్నలు ఇప్పుడు కాషాయ శ్రేణుల్ని తొలుస్తున్నాయి.
దుబ్బాకలో చూపిన ఉత్సహం ఏమైంది.? సూటిగా ప్రశ్నిస్తున్న పార్టీ శ్రేణులు..
సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దికోసం చాలా కసరత్తు చేసిన బీజేపి చివరకు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బీజేపి అభ్యర్థి స్థానికుడు అయినప్పటికి తలా తోకా లేకుండా వ్యవహరించిన తీరు ఓటమికి కారణమనే చర్చ జరుగుతోంది. గెలిస్తే సాగర్ ప్రజలకు ఎం చేస్తామనే ప్రధాన లైన్ మిస్సయిన బీజేపి తగు మూల్యం చెల్లించుకున్నట్టైంది. దుబ్బాక ఎన్నిక పలితాన్ని సాగర్ లో కూడా పునరావృతం చేస్తామని పలుసందర్బాల్లో తేల్చి చెప్పిన బీజేపి క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ విధంగా వ్యవహరించనట్టు కనిపించలేదు. సాగర్ ఎన్నికను తెలంగాణ బీజేపి మొత్తం నామమాత్రంగా చూసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
నిరాశలో బీజేపి శ్రేణులు.. ఆవిరైన దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయం..
అధికార గులాబీ పార్టీతో చీటికి మాటికీ కయ్యానికి కాలు దువ్వుతున్న బీజేపి పార్టీకి సాగర్ ఫలితం నిరాశను మిగిల్చినట్టు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపి మాత్రమే అని చెప్పుకుంటున్న కాషాయ దళం ఇప్పుడు గులాబీ నేతలు సంధించే ప్రశ్నలకు ఏ రూపంలో సమాధానం చెప్తారో చూడాలి. దుబ్బాక ఉప పోరులో చూపిన ఉత్సాహం సాగర్ లో ఎందుకు చూపలేదనేది బీజేపి శ్రేణులను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్ ఏం సంజాయిషీ ఇస్తారనే అంశం ఆసక్తిగా మారింది. బీజేపి అద్యక్షునితో పాటు రాష్ట్రస్థాయి నాయకుల నిర్లక్ష్యమే సాగర్ లో ఘోర పరాజయానికి కారణమనే చర్చ జరుగుతోంది.