మంత్రి ఈటెలపై నయీమ్ పగ: డ్రైవర్కు చిత్రహింసలు, టీవీ రిపోర్టర్ల అరెస్ట్
హైదరాబాద్: సోమవారం ఉదయం షాద్నగర్ ఎన్కౌంటర్లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ నయీమ్.. తాను బతికున్న కాలంలో కొనసాగించిన దందాలకు సంబంధించి ఒక్కోటి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్నటిదాకా నయీమ్ వేధింపులను భరించిన పలువురు ప్రముఖులు అతడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు.
ఈ క్రమంలో టిఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు నయీమ్ నుంచి ఎదురైన ఇబ్బంది కూడా కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య అనంతరం ఆయన సోదరుడు రాములుకు కూడా నయీమ్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి.
ఈ క్రమంలో బెంబేలెత్తిపోయిన రాములు.. ఈటెలను ఆశ్రయించాడు. దీంతో ప్రభుత్వంతో మాట్లాడిన ఈటెల... రాములుకు భద్రత కల్పించారు. దీనిని మనసులో పెట్టుకున్న నయీమ్.. ఈటెలను ఏమీ చేయలేక, ఆయన డ్రైవర్ను కిడ్నాప్ చేశాడు.
అనంతరం ఆ డ్రైవర్ను చిత్రహింసలకు గురి చేశాడు. విషయం తెలుసుకున్న ఈటెల.. పార్టీ పెద్దలకు ఈ విషయం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన కొందరు పార్టీ నేతలు నయీమ్ చెర నుంచి ఈటెల డ్రైవర్కు విముక్తి కల్పించారు.
నయీమ్కు సాయం చేసిన టీవీ ఛానల్ రిపోర్టర్ల అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ నయీమ్ హత్యానంతరం.. అతనితో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, నయీమ్కు అనుచరులుగా ఉంటూ, పలు మోసాల్లో భాగం పంచుకున్న ముగ్గురు టెలివిజన్ ఛానల్ రిపోర్టర్లను అరెస్ట్ చేశారు.
వీరు ముగ్గురూ నయీమ్ అండదండలు చూసుకుంటూ రూ. 35 కోట్ల మేరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. సోమవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. రిపోర్టర్ల అరెస్టుపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.