గ్రామీణ కేంద్ర నేర పరిశోధక విభాగమేది?: మహబూబాబాద్లో జాప్యం
వరంగల్: జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్ను విస్తరించారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చారు. జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలకు ఎస్పీలను నియమించారు. ఉమ్మడి జిల్లాలో కేంద్ర నేర పరిశోధక విభాగాలు కమిిషనరేట్కు ఒకటి, రూరల్ ఒకటి ఉండేది. ఈ రెండు విభాగాలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం మట్టెవాడలో ఉండేవి. నేరాల నియంత్రణకు, నేరాల పరిశోధనకు ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
జిల్లాల విభజనతో ప్రస్తుతం రూరల్ నేర పరిశోధక విభాగం కనుమరుగైంది. దీనిలో పని చేస్తున్న సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపించారు. రెండు జిల్లాలో ఈ విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఆ జిల్లాలోని గణపురం పోలీసుస్టేషన్ ఆవరణలో ఈ విభాగం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తగినంత సిబ్బందిని కేటాయించారు.
మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మహబూబాబాద్లో నేర పరిశోధక విభాగం సిబ్బంది వివిధ పోలీసుస్టేషన్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా వారు పూర్తి స్థాయిలో నేరాలను నియంత్రంచలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలకు ఈ విభాగానికి కేటాయించిన సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.
అత్యంత కీలమైన విభాగం
పోలీసుశాఖలో అత్యంత కీలమైంది కేంద్ర నేర పరిశోధక విభాగం. నేరాల నియంత్రణతోపాటు బంగారు గొలుసు చోరీలు, ఇళ్లలలో చోరీలు, చేసిన కేసులలో నిందితులను పట్టుకోవడంలో ఈ సిబ్బంది నిరంతరం పని చేస్తుంటారు. పలు కీలకమైన కేసులను సైతం ఈ పోలీసుల ఛేదించిన సంఘటనలు ఉన్నాయి. ఈ పోలీసుస్టేషన్ల ఏర్పాటులో జాప్యం జరగడంతో నేరాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే మహబూబాబాద్లో పలు చోట్ల చోరీలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించాలంటే కేంద్ర నేర పరిశోధక విభాగాన్ని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలుంటాయి. అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విభాగం పరిధిలో జిల్లా మొత్తం ఉంటుంది. పాత నేరస్థులపై నిఘా ఉంటుంది. ఇలాంటి కీలకమైన విభాగం ఏర్పాటులో జాప్యం ఉంటే ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. నేరస్థులకు సంబంధించి చాలా వివరాలు సీసీఎస్ కార్యాలయంలో భద్రపరుస్తారు.
మూడు జిల్లాలకు కలిపి పాత స్థానంలోనే..
ఇక కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలకు సంబంధించిన కేంద్ర నేర పరిశోధక విభాగం ప్రస్తుత స్థానంలోనే (మట్టెవాడలో) ఉంటుంది. ఈ జిల్లాలకు సంబంధించిన నేరాల నియంత్రరణకు ఇక్కడి నుంచి చర్యలు చేపడతారు.
ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం: డీఐజీ రవివర్మ
'నూతనంగా ఏర్పడిన జిల్లాలో కూడా కేంద్ర నేర పరిశోధక విభాగాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహబూబాబాద్లో కూడా సీసీఎస్ సిబ్బంది పని చేస్తున్నారు. వారు వివిధ పోలీస్స్టేషన్లలలో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రత్యేకం కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచిస్తాం' అని డీఐజీ రవివర్మ తెలిపారు.