నేను ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీదే విజయం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఖమ్మం: బీఆర్ఎఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డి కూడా తాను చేరబోయే పార్టీపై ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. అయితే, తాజాగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము ఏ పార్టీలో చేరతామో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జడ్పీ ఛైర్మన్ కోరల కనకయ్యతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మరో ఐదారు నెలలు మాత్రమే మనుగడలో ఉంటుందని పొంగులేటి జోస్యం చెప్పారు. ఆ విషయాన్ని మరిచిపోయి అధికారులు వారికి తొత్తులుగా ప్రవర్తిస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. తనతోపాటు తన వెంటే ఉన్న అనుచరులకు భద్రతను తగ్గించారని తెలిపారు.

సెక్యూరిటీ తగ్గించడం వల్ల తమకు ఏమైనా ప్రాణ హాని కలిగితే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఇద్దరు ఎస్పీలే బాధ్యత వహించాల్సి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం డబ్బులు వేస్తోందని.. ఇతర పార్టీలకు చెందిన రైతులకు నగదు జమ చేయడం లేదని ఆరోపించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా కూడా గుర్తించడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు అయిందని.. ఆ పేరుతో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉందని ఏకంగా ఆ పేరునే బీఆర్ఎస్గా మార్చిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారులు తీరుపై విమర్శలు చేస్తున్న కార్యకర్తలను ఇబ్బంది పెడితే మాత్రం.. రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకు ఎంతో కాలం లేదని.. ఐదారు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాలన్నారు. తాము ప్రజలకు అండగా ఉంటామని.. ప్రజలతోనే ఉంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications