ఎక్కడి నుంచి లీకవుతున్నాయి?: కావాలనే చేస్తున్నారా!.. శిరీష 'ఆడియో'పై అనుమానాలు..
మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియో టేపులు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అటు పోలీసులు సైతం ఈ ఆడియో టేపుల గురించి తమకు తెలియదని, శ్రవణ్, రాజీవ్ లను కస్టడీలోకి తీసుకున్న తర్వాతే ఇవి బయటకొచ్చాయని చెబుతున్నారు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఎడతెగని ఉత్కంఠకు ఎంతకీ తెరపడటం లేదు. ఆత్మహత్య అని సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించినప్పటికీ.. రిమాండ్ రిపోర్టు ద్వారా వెలికి వచ్చిన నిజాలు.. శిరీష కుటుంబ సభ్యులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు.. శిరీష మృతిపై ఇంకా అనుమానాలను పెంచుతూనే ఉన్నాయి.
ట్విస్ట్: కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం, రాజీవ్,శ్రవణ్ కస్టడీ కోరిన పోలీసులు
రిమాండ్ రిపోర్టులో శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు తేలడం.. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో సీసీటివి ఫుటేజీ మాయమవడం పలు అనుమానాలకు తావిచ్చేవిగా మారాయి. మరోవైపు శిరీష ఆడియో టేపులు రోజుకొకటి బయటకి వస్తుండటంతో.. అసలు ఈ లీకేజీ వ్యవహారమంతా ఎక్కడినుంచి సాగుతుందనే దానిపై స్పష్టత రావడం లేదు.
ఎవరీ నందు, నవీన్?
తాజాగా నందు, నవీన్ అనే ఇద్దరు వ్యక్తులతో శిరీష మాట్లాడిన ఆడియో టేపులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రాజీవ్ కు తనకు మధ్య తేజస్విని అడ్డురాకుండా చూసుకోవాలని ఆ ఆడియో టేపుల్లో శిరీష నందు, నవీన్ లకు సూచించడాన్ని గమనించవచ్చు. అయితే ఈ ఇద్దరూ శిరీషకు స్నేహితులా?.. కాకపోతే మరెవరు? అన్న దానిపై సందిగ్థత నెలకొంది.
రాజీవ్ కు తెలియకుండా?
రాజీవ్కు తెలియకుండా.. తేజస్వినికి వార్నింగ్ ఇవ్వడానికి శిరీషనే వారిని పురమాయించి ఉంటుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మాటల మధ్యలో రాజీవ్ను 'వాడు' అంటూ అవతలి వ్యక్తి సంబోధించడాన్ని కూడా శిరీష తట్టుకోలేకపోయింది. దీన్నిబట్టి రాజీవ్ పట్ల శిరీష వైఖరి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తేజస్విని పట్ల ద్వేషం:
తేజస్వినితో శిరీషకు ఎంతటి విభేదాలున్నాయో ఈ ఆడియో టేపుల్లో స్పష్టమైంది. అందుకే తేజస్విని ఏమని తిట్టారో తనకు చెప్పాలని.. లేదంటే కాల్ రికార్డింగ్స్ పంపించాలని వారిని పదేపదే కోరింది. అయితే ఈ ఆడియో టేపులు అకస్మాత్తుగా మీడియాలో ఎలా ప్రత్యక్షమవుతున్నాయనే దానికి సమాధానం లేకుండా పోయింది. చనిపోయిన వ్యక్తి ప్రతిష్టను మరింత దిగజార్చేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వారి మొబైల్ నుంచే లీకవుతున్నాయా?
మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియో టేపులు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అటు పోలీసులు సైతం ఈ ఆడియో టేపుల గురించి తమకు తెలియదని, శ్రవణ్, రాజీవ్ లను కస్టడీలోకి తీసుకున్న తర్వాతే ఇవి బయటకొచ్చాయని చెబుతున్నారు. శిరీష, రాజీవ్ ల మొబైల్ లో వందలకొద్ది కాల్ రికార్డింగ్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇవన్ని వారి మొబైల్ నుంచే లీకై ఉంటాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
తేజస్విని పాత్ర ఏంటి?
శ్రవణ్, రాజీవ్ లను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే.. వీటన్నింటి పైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి అసలు తేజస్విని పాత్ర ఏంటో నిర్దారించాలంటే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే రాజీవ్-తేజస్విని మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా స్పష్టత లేకుండా పోవడంతో.. ఈ విషయంపై కూడా ఆరా తీయాలనుకుంటారు. వీటితో పాటు కుకునూర్ పల్లి వెళ్లే దారిలో.. కారులో అసలేం జరిగిందనే దానిపై వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.