ఆ ముగ్గురిలో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరు? రేవంత్కు దక్కుతుందా? హైకమాండ్ మొగ్గు ఎవరివైపు..
టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తున్నందునే ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్కి కొత్త నాయకుడిని ఎంపిక చేసే పనిలో పడింది హైకమాండ్. ఇందుకోసం పలువురు నాయకులను పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుల పేర్లే జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.
రేసులో ఎవరెవరు..?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి చిన్నారెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్లు టీపీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ల పేర్లను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. వీళ్లలో అధిష్టానం ఎవరికి పదవిని కట్టబెట్టబోతుందన్నది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రేవంత్కి దక్కుతుందా?
టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నవాళ్లలో రేవంత్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి.. టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టడమే టార్గెట్గా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే తన లక్ష్యం అని పలుమార్లు స్వయంగా వెల్లడించిన రేవంత్.. అందుకోసం టీపీసీసీ చీఫ్ పదవిని షార్ట్ కట్గా భావిస్తున్నారు. నిజానికి డిసెంబర్, 2018లో జరిగిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్కి కట్టబెట్టాలని అధిష్టానం భావించినప్పటికీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సీనియర్ నేతలు జానారెడ్డి,కోమటిరెడ్డి,వెంకట్ రెడ్డి,షబ్బీర్ అలీ,వీ హనుమంతరావు వ్యతిరేకంచడంతో.. రేవంత్కు పదవి దూరమైంది. ఇటీవలే మరికొద్ది మంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి.. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినవాళ్లకే టీపీసీసీ పదవి ఇవ్వాలని మెలిక పెట్టారు. ఇది కూడా రేవంత్కు పదవిని దూరం చేయడంలో భాగంగా జరిగిందేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రేవంత్కి కాకపోతే..
సీనియారిటీ,పార్టీ పట్ల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుంటే చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకుడే కావాలనుకుంటే రేవంత్ వైపు అధిష్టానం మొగ్గుచూపవచ్చు. అయితే రేవంత్ ఎంపికకు సీనియర్లు అడ్డుపడే అవకాశం ఉండటంతో.. అధిష్టానం ఏం నిర్ణయిస్తుందనేది సస్పెన్స్గా మారింది. ఇక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా రేసులో గట్టిగానే వినిపిస్తోంది. పార్టీకి విధేయుడు, సైలెంట్గా పనిచేసుకుపోతాడన్న పేరు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. సీనియర్ నేతలతో శ్రీధర్ బాబుకు సఖ్యత ఉండటం కూడా మరింతగా కలిసొచ్చే అంశం.
ఏపీ తరహాలో అనూహ్య నిర్ణయమేమైనా..
ఏపీలో టీపీసీసీ చీఫ పదవి కోసం గిడుగు రుద్రరాజు, పళ్లంరాజుతోపాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. అధిష్టానం మాత్రం అనూహ్యంగా శైలజానాథ్కే పదవిని కట్టబెట్టింది. అలా తెలంగాణ విషయంలోనూ అనూహ్య నిర్ణయాలేమైనా తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈ నెల 22న రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కూడా టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నవాళ్లకు సవాల్గా మారాయి. కాంగ్రెస్కు ఎవరైతే ఎక్కువ స్థానాలను కట్టబెడుతారో.. టీపీసీసీ పదవి కోసం వాళ్లు గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నేతలు తమవంతు ప్రయత్నాలుచేస్తున్నారు. ఏదేమైనా మరికొద్దిరోజుల్లోనే టీపీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.