ఎవరిపై ఏడాదిన్నర భారం?: రూ.4000 కోట్లు సర్కార్ చెల్లిస్తుందా? అరగంట వరకే టోకెన్ చెల్లుబాటు

హైదరాబాద్‌: భాగ్యనగర ప్రజల కలల ప్రాజెక్టు 'మెట్రో' ప్రారంభం ఏడాదిన్నర ఆలస్యమైంది. ఇప్పటివరకు ఖర్చు రూ.13 వేల కోట్లయితే అదనపు భారం రూ.4000 కోట్లు ఉంటుంది. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తే రెండో విడత అమీర్‌పేట్ ‌- రాయదుర్గం (11 కి.మీ.), అమీర్‌పేట్ ‌- ఎల్బీనగర్‌ (16 కి.మీ.) మార్గంలో చేపట్టిన పనులపై ప్రతికూల ప్రభావం పడనున్నది.
కలల మెట్రో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. తొలివిడతగా 30 కి.మీ. మార్గంలో పరుగులు తీస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్‌ ఖరారు, పనులు చేపట్టేందుకు వీలుగా ప్రధాన రహదారుల్లో రైట్‌ ఆఫ్‌ వే సమస్యలతో మొత్తం 66 కి.మీ. మార్గం పూర్తికి 18 నెలలు అదనంగా సమయం పడుతోంది.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్టు 2018 డిసెంబర్‌ నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయోగం విఫలం అవుతుందా? సఫలం అవుతుందా? అన్న అంశం ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారడం గమనార్హం.

 రెండో విడతపై ఇలా ప్రతికూల ప్రభావం

రెండో విడతపై ఇలా ప్రతికూల ప్రభావం

హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీపై సుమారు రూ.4000 కోట్లు అదనపు భారం పడుతున్నట్లు తెలిసింది. ఈ భారాన్ని తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీంతో నిర్మాణ సంస్థ డోలాయమానంలో పడినట్లు సమాచారం. దీనికి తోడు జీఎస్టీ ఎఫెక్ట్‌.. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై పెరిగిన వడ్డీల భారం.. మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వెరసి కంపెనీకి ఆర్థికంగా భారంగా మారినట్లు తెలిసింది. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తే రెండో విడత అమీర్‌పేట్ ‌- రాయదుర్గం (11 కి.మీ.), అమీర్‌పేట్ ‌- ఎల్బీనగర్‌ (16 కి.మీ.) మార్గంలో చేపట్టిన పనులపై ప్రతికూల ప్రభావం పడనున్నది.

అలైన్‌మెంట్ మార్పుపై తర్జనభర్జనలు జరిపినా వేస్ట్

అలైన్‌మెంట్ మార్పుపై తర్జనభర్జనలు జరిపినా వేస్ట్

మెట్రో నిర్మాణ ఒప్పందం ఖరారైన 2010 సెప్టెంబర్‌లో ప్రాజెక్టును రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. కానీ అసెంబ్లీ, ఓల్డ్ సిటీ, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్పుపై ప్రభుత్వం పలుసార్లు తర్జనభర్జనలు చేసినా స్పష్టతను ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం మరో రూ.4000 కోట్లు అదనంగా పెరిగినట్లు తెలిసింది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు.. కేంద్రం సర్దుబాటు నిధి కింద రూ.1,458 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల సేకరణకు మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేశాకే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకైన ఖర్చును ప్రజల ముందు పెడతామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ఎవరు భరిస్తారన్న అంశం సందేహస్పదంగా మారింది.

మరో 20 ఏళ్లు కాంట్రాక్ట్ పొడిగించే చాన్స్?

మరో 20 ఏళ్లు కాంట్రాక్ట్ పొడిగించే చాన్స్?

గ్రేటర్‌వాసుల కలల మెట్రో పరుగులు పెడుతున్నా, మరో ఐదేళ్లు నష్టాల బాట తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరో ఏడాది నుంచి నష్టాల నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా మెట్రో ప్రాజెక్టుకైన వ్యయాన్ని 50% ప్రయాణికుల చార్జీలు, మరో 45% వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు (ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్ ‌- టీఓడీ), మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా 45 ఏళ్లపాటు సమకూర్చుకోవాలి. నిర్మాణ ఒప్పందం ప్రకారం ఈ గడువును మరో 20 ఏళ్లపాటు పొడిగించుకోవచ్చు.

రెండు చోట్ల మాత్రమే మాల్స్ నిర్మాణం పూర్తి

రెండు చోట్ల మాత్రమే మాల్స్ నిర్మాణం పూర్తి

ముందుగా నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం నిర్మాణ సంస్థకు కీలక ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల స్థలంలో 18 మాల్స్‌ నిర్మించి 60 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాలను నిర్మించాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి పంజాగుట్ట, హైటెక్‌ సిటీల్లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే మాల్స్‌ ఏర్పాటయ్యాయి. వీటిని ఈ నెలలో ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సన్నాహాలు చేస్తోంది. ఇక మూసారాంబాగ్, ఎర్రమంజిల్‌ మాల్స్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తారు. మరో 10 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. అయితే నిర్మాణ సంస్థ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆశించిన మేర ఆదాయం లభించడం లేదన్నది స్పష్టమౌతోంది.

నేడు సెలవు కావడంతో మరింత రద్దీ!

నేడు సెలవు కావడంతో మరింత రద్దీ!

మెట్రోరైలుకు మూడో రోజూ అదే ఆదరణ. అదే రద్దీ. శుక్రవారం సాయంత్రానికి 1.5 లక్షల మంది ప్రయాణించారని, రాత్రికి ఆ సంఖ్య రెండు లక్షల మందికి చేరుకుంటుందని అధికారుల అంచనా. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో ప్రయాణికుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులకు ఎల్‌ అండ్‌ టీ పలు సూచనలు చేసింది. పెద్దలు ఒకరి వెంట ఒక చిన్నారికే ఉచిత అనుమతి ఉంటుందని తెలిపింది. అయితే ప్రయాణ టోకెన్‌ తీసుకున్న అరగంటలోగా స్టేషన్‌లోకి వెళ్లాలి. గరిష్ఠంగా మూడు గంటల్లోగా గమ్యస్థానం చేరుకోవాలి. అధిక సమయం మెట్రో ప్రాంగణంలో గడిపితే గంటకు కనిష్టంగా రూ.10, గరిష్ఠంగా రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంది. టికెట్‌ లేని ప్రయాణం చేసే వారిపై రూ.50 జరిమానాతోపాటు అదనంగా గరిష్ఠ ఛార్జీ విధిస్తుంది. టికెట్‌ విలువ కంటే ఎక్కువదూరం ప్రయాణిస్తే ఆ రెండు స్టేషన్ల మధ్య ఛార్జీని వసూలు చేస్తారు. నాగోలు నుంచి మియాపూర్‌కు ఒకే టికెట్‌ తీసుకోవచ్చు. అమీర్‌పేట కూడలి స్టేషన్‌లో మారాల్సి ఉంటుంది కాబట్టి రెండు టోకెన్లు ఇస్తారు. ఒకవేళ రెండోదాన్ని ఉపయోగించకపోతే 30 నిమిషాల్లోగా తిరిగి ఇచ్చి, డబ్బు వెనక్కి తీసుకోవచ్చు.

వచ్చే మార్చి వరకే స్మార్ట్ కార్డులో రాయితీ

వచ్చే మార్చి వరకే స్మార్ట్ కార్డులో రాయితీ

ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 వరకూ రైళ్లు నడుస్తాయి. ఉదయం నుంచే నుంచే టోకెన్లు, స్మార్ట్‌కార్డులను విక్రయిస్తారు. చివరి రైళ్లు నాగోలు, అమీర్‌పేట, మియాపూర్‌లలో రాత్రి 10 గంటలకు బయల్దేరతాయి.ప్రతి స్టేషన్‌లో చివరి రైలు బయల్దేరడానికి అరగంట ముందు టిక్కెట్ల జారీని నిలిపేస్తారు. స్మార్ట్‌కార్డు పోయినా, పాడైనా అందులోని సొమ్ము తిరిగి రాదు. వచ్చే మార్చి నెలాఖరు వరకు ‘మెట్రో స్మార్ట్' కార్డుపై ఇస్తున్న ఐదు శాతం ప్రయాణ రాయితీ అమలులో ఉంటుంది. రూ.100, అంతకంటే ఎక్కువ మొత్తంలో స్టేషన్ల వద్దే కాక.. ఎల్‌అండ్‌టీ మెట్రో వెబ్‌సైట్‌, మెట్రోరైలు టీ - సవారీ యాప్‌, పేటీఎంతోనూ స్మార్ట్‌కార్డును రీ ఛార్జి చేసుకోవచ్చు. టీ - సవారీ యాప్‌లో నమోదు చేసుకుంటే, రూ.200 విలువైన మెట్రోకార్డు ఇంటికే వస్తుంది. కాకపోతే మనం దీనికి రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది సుమా!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+