కేవీపీ ఎఫెక్ట్: బాబుని ఇరికిస్తున్న కేసీఆర్, ప్లాన్ వెనుక, వెంకయ్య చక్రం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేస్తోంది. ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతిస్తుంది, ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు పైన చర్చ జరగాలని, ఓటింగ్ జరగాలని ఏపీ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత సమావేశాల మాదిరిగా దానిని పక్కన పెట్టే కుట్ర చేయవద్దని బీజేపీ, టిడిపిలను హెచ్చరించారు. బిల్లుకు తాము అందరి మద్దతు కూడగడతామని చెబుతున్నారు.
తెరాస మద్దతు.. బాబుకు షాక్
వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు కూడా మద్దతివ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస మద్దతు పలకాలని దాదాపు నిర్ణయించింది. తెరాస మద్దతు టిడిపిని కూడా ఇరుకున పెట్టినట్లవుతుందని అంటున్నారు.
సిగ్గుందా, మీ ఇంటివద్దే ఉరేసుకుంటా: బాబు-వెంకయ్యలపై హీరో శివాజీ తీవ్రవ్యాఖ్యలు
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. తాము మద్దతు పలుకుతామని చెబుతూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా అనేది రాజకీయ నిర్ణయమని కేటీఆర్ చెప్పారు. బిల్లుకు మద్దతు పలుకుతామని చెప్పారు. అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కు అన్నారు. హైకోర్టు విభజనపై మాట్లాడుతూ.. త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నామని, లేదంటే తమ మార్గం తమకుందన్నారు.
తెరాస మద్దతు వెనుక..!
ప్రత్యేక హోదా బిల్లుకు తెరాస మద్దతు పలకడం వెనుక వ్యూహం దాగి ఉందని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని తెరాస ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఆ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా, తదుపరి తెరాస తమకూ ఇవ్వాలని మరింత ఎక్కువగా డిమాండ్ చేయనుందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా తమకు మద్దతు పలికేలా ఒత్తిడి తెచ్చే అవకాశముంది.
వైసిపి, టిడిపిల మద్దతు
కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ల వ్యాఖ్యలు చూస్తే బిల్లుకు అనుకూలంగానే టిడిపి వ్యవహరించే అవకాశముంది. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కు చేసినా.. మద్దతివ్వకుంటే రేపు విపక్షాలు, ప్రజలు నిలదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బీజేపీపై అనుమానాలు
గత సమావేశాల్లోనే ఈ బిల్లు పైన చర్చ, ఓటింగ్ పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్లాన్డ్గా అలా జరగకుండా చేశారని అంటున్నారు. ఈసారి కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తే అనుమానం కలుగుతోందని అంటున్నారు.
ప్రత్యేక హోదాపై పావులు, ఎవరికి షాక్?: 'కాంగ్రెస్' కేవీపీకి బాబు కౌంటర్
వెంకయ్య చక్రం తిప్పుతున్నారా?
మంగళవారం నాడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెరాస, టిడిపి ఎంపీలతో సమావేశమయ్యారు. కేవీపీ బిల్లుకు టిడిపి, తెరాసలు కూడా మద్దతు పలుకుతాయనే వార్తలు, వెంకయ్య భేటీ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏమైనా చక్రం తిప్పుతున్నారా అనే చర్చ సాగుతోంది.
అయితే, ఈ బిల్లు గురించి మాత్రమే కాకుండా, ఇతర బిల్లులు, జిఎస్టీ బిల్లు పైన మద్దతు కూడ గట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో హైకోర్టు విషయంలో బీజేపీని తెరాస ఇరుకున పెట్టే అవకాశముంది. దీని పైన కూడా ఆయన తెరాస ఎంపీలతో మాట్లాడారని తెలుస్తోంది.