ఆ కుటుంబానిది గుండెలు పిండేసే నేపథ్యం-నాలుగు రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడమేంటి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేసే ప్రభుత్వం... అత్యాచార నిందితులను పట్టుకోకపోవడమేంటని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని సైదాబాద్లోని సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటన జరిగిన నాలుగు రోజులవుతున్నా నిందితుడిని పట్టుకోకపోవడమేంటని నిలదీశారు. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం(సెప్టెంబర్ 13) సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.
ఆ కుటుంబానిది గుండెలు పిండేసే నేపథ్యం..
ఆ కుటుంబ పరిస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం కలుగుతోందన్నారు. పేద ప్రజల జీవితాల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. సంఘటన జరిగి నాలుగు రోజులైనా ముఖ్యమంత్రి గానీ మంత్రులు గానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గానీ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఆ కుటుంబ నేపథ్యం గుండెలు పిండేసేదిగా ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టు కింద ఐదెకరాల భూమి ముంపుకు గురైతే... ఆ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిందన్నారు. ఐదెకరాల ఆసామి ఇప్పుడు రేకుల షెడ్డులో బతికే దుస్థితి వచ్చిందన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరపాలి : ప్రవీణ్ కుమార్
పట్టపగలే ఓ చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. సాయంత్రమైతే చాలు... ఇక్కడ బహిరంగంగా గంజాయి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారని అన్నారు. గంజాయి మత్తులో,లిక్కర్ మత్తులో మునిగిపోయే వ్యక్తులను చూసి... స్థానికులు భయంతో,బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆ బాలికకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలన్నారు.
ప్రజలు తిరుగుబాటు చేస్తారు : సీతక్క
అంతకుముందు,ఎమ్మెల్యే సీతక్క బాధిత కుటుంబాన్ని పరిశీలించారు.న్యాయం జరగకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్నారు. బాధిత కుటుంబం తరుపున తాము పోరాడుతామన్నారు. గిరిజన బాలిక కాబట్టే ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన రావట్లేదన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే అట్టడుగు వర్గాల నుంచి తిరుగుబాటు రాక తప్పదని హెచ్చరించారు.కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలో డ్రగ్స్,గంజాయి కార్యకలాపాలు సాగుతుంటే ఆయన ఎందుకు స్పందించట్లేదన్నారు. కనీసం ఒక్క అధికార పార్టీ నేత బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లేదన్నారు. దిశ ఘటన జరిగినప్పుడు పన్నుకు పన్ను,కంటికి కన్ను అని మాట్లాడిన సీఎం కేసీఆర్... ఇప్పుడెందుకు మాట్లాడట్లేదన్నారు.
Recommended Video
నాలుగు రోజుల క్రితం అత్యాచార ఘటన
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications