తప్పు చేయకపోతే భయమెందుకు?: టీఆర్ఎస్ సర్కారుపై కేంద్రమంత్రి సింధియా విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కారుపై కేంద్రమంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని చంపాపేట్లో జరిగిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో అవినీతి తీవ్రస్థాయిలో ఉందన్న సింధియా
ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు వచ్చాయని తెలిపారు. అయితే, ఆ నిధులు సద్వినియోగమయ్యాయో.. దుర్వినియోగమయ్యాయో తేల్చాల్సి ఉందన్నారు .

తప్పు చేయనప్పుడు భయమెందుకని టీఆర్ఎస్ సర్కారుపై సింధియా
తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ అంటే భయమెందుకు? అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు జ్యోతిరాదిత్య సింధియా. పార్టీ నేతల కృషితో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్రమంత్రి సింధియా ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి మెట్రో, అభివద్ధి అంటూ సింధియా
హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి సింధియా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సింధియా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ..
పాతబస్తికి మెట్రో రైలు ఎందుకు విస్తరించడం లేదని సింధియా ప్రశ్నించారు.పాతబస్తి అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పాతబస్తి సంక్షేమం-అభివృద్ధి బీజేపీ విధానమని సింధియా స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం చారితత్రాత్మకమైందని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ రోడ్లు దారణంగా ఉన్నాయంటూ సింధియా
మరోవైపు, హైదరాబాద్ రోడ్ల పరిస్థితిపై జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ రోడ్లను చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యానని తెలిపిన సింధియా.. కేవలం 10 నిమిషాల దూరానికి 30 నిమిషాలు పట్టిందన్నారు రూ. 10వేల కోట్లతో వేయి కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కాగా, కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ రోడ్లు జలమయమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications