‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. గాంధీలోనూ పరీక్షలు జరపాలని ఆదేశించింది.

ఆ ఆస్పత్రులపై చర్యలేంటి? గరిష్ట ధరలు నిర్ణయించండి..
కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రూ. 4 లక్షలకుపైగా బిల్లు వేసిన యశోద, కిమ్స్ తదితర ఆస్పతులపై ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ సర్కారును ప్రశ్నించింది. ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట ఛార్జీలు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లోని బెడ్లు, వెంటిలేటర్ల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. హైదరాబాద్లోని నాచారం ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారో? లేదో చెప్పాలని, దీనిపై పూర్తి వివరాలతో జులై 27 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణలో 1 శాతం మరణాలే..
ఇది ఇలావుండగా, తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లోనూ కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 12,178 యాక్టివ్ కేసులున్నట్లు మంగళవారం ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 65.48 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా బాధితుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే మరణించారని వివరించారు.

తెలంగాణలో అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి..
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత తెలంగాణలోనూ ప్రజల కదిలికలు ఎక్కువయ్యాయని.. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో 85 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు.
కరోనా లక్షణాలు పెద్దగా లేనివారికి హోం ఐసోలేషన్ సదుపాయం ఇంటి వద్దకే అనుమతిస్తున్నామని.. సౌకర్యాలు సరిగ్గాలేని వారికి ప్రభుత్వ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Recommended Video

9786 మంది కరోనా రోగులు హోం ఐసోలేషన్లోనే..
తెలంగాణలో ఉన్న మొత్తం కరోనా యాక్టివ్ కేసుల్లో 9786 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారని చెప్పారు. సోమవారం నుంచి హైదరాబాద్ టిమ్స్లోనూ చికిత్స అందించడం జరుగుతోందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 98 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతులు ఉన్నాయని వివరించారు.
ఇక నుంచి ఖాళీగా ఉన్న పడకల వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచుతామని చెప్పారు. ప్రజల సహాయం కోసం కరోనాపై అవగాహనకు 3 రకాల కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 104కు ఫోన్ చేసి వైద్య సాయం పొందవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications