కనీసం వార్డు మెంబర్ కాని వైఎస్ షర్మిలపై మోడీకి ఎందుకింత ప్రేమ?
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించటాన్ని తప్పు పట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ వైఎస్ షర్మిల కు ఫోన్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
స్థాయి దాటి మాట్లాడితే తెలంగాణా ప్రజలు ఊరుకోరు: సత్యవతి రాథోడ్
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ వారైనా తిరిగే స్వేచ్ఛ ఉందని, కాకుంటే స్థాయికి తగ్గట్టే మాట్లాడాలని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. స్థాయి దాటి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె హెచ్చరించారు. మానుకోట రాళ్ళ దెబ్బ గుర్తు పెట్టుకోవాలన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇన్ని రోజులు ఆడిన నాటకానికి సూత్రధారి ప్రధాని నరేంద్ర మోడీ అని తేటతెల్లమైందని సత్యవతి రాథోడ్ అన్నారు.
మోడీకి షర్మిలపై ఎందుకింత ప్రేమ?
రాష్ట్రం పై విషం కక్కుతున్న మోడీ ఎమ్మెల్యేలను పార్టీ మార్చడానికి, కొనుగోలు చేయడానికి స్వామీజీలను పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టుల గురించి, ఎన్నోమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసినా కనికరించలేదు అని పేర్కొన్న మంత్రి సత్యవతి రాథోడ్ అలాంటి మోడీకి షర్మిలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది అని ప్రశ్నించారు. అసలు వార్డు మెంబర్ గా కూడా గెలవని షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేయడమేమిటని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు .
సీఎంపై అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణా సమాజం ఊరుకోదు .. మంత్రి హెచ్చరిక
సీఎం కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోబోదని మంత్రి హెచ్చరించారు. రాజకీయాల్లో ఎంత కాలం పని చేశామని కాదు, ఎంత మంచి చేశాం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఏమీ చేయలేదని విమర్శించారు.
విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణలో బీజేపీ విష ప్రచారానికి తెర తీసింది అని మండిపడిన సత్యవతి తెలంగాణా కు మొదటి శత్రువు వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే తర్వాత ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల అంటూ ఆరోపించారు.
షర్మిలను రంగంలోకి దించింది బీజేపీనే
విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఆరోపించారు. కెసిఆర్ ని తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణలోని ప్రజలకే కాదు, రాళ్లకు పవర్ ఉంటుంది అని తెలుసుకుని వైయస్ షర్మిల మాట్లాడితే మంచిదని మంత్రి సత్యవతి రాథోడ్ హితవుపలికారు.
ఇక మానుకోటలో నిరుపేదలకు పూర్తిస్థాయి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధిస్తుంటే కేంద్రంలోని బీజేపీ అక్కసు వెళ్ళగక్కుతున్నదని, అందుకే షర్మిలను రంగంలోకి దించింది అని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.