రాహుల్ ఓయూకు ఎందుకు,ఏం చెప్పడానికి వస్తున్నాడు.?సూటిగా ప్రశ్నించిన హరీష్ రావు.!
హైదరాబాద్ : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయంగా వేడి రగిలిస్తోంది. రాహుల్ పర్యటన పట్ల నిన్నటివరకూ ఓయూ విద్యార్ధులు మాత్రమే స్పందించగా తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఘాటు విమర్శలు చేసారు. అధికారం కోసం ఎంత నీచమైన స్థాయికైనా దిగజారే పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని, తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ వారితో పొత్తు పెట్టుకుంటారా.?అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలిపెస్తారా.? అని నిలదీసారు. అంతే కాకుండా తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నావని రాహుల్ గాంధీని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు.
అంతే కాకుండా రాహుల్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ గల్లంతవుతుందని, ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోయిందని ఎద్దేవా చేసారు. దాంతో పాటు బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ పైన హరీష్ విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని నిలదీసారు. తాజాగా తెలంగాణలో 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలు ఉన్నాయని, వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, కానీ తెలంగాణలో నిరంతర విద్యుత్ పంపిణీ కొనసాగుతున్నదని హరీష్ రావు వివరించారు.