ఓటుకు నోటు, కెసిఆర్కు బాబు పిలుపు: టిడిపి ఖాళీ కావడం వెనుక..!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల అనంతరం... తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కారు ఎక్కారు. అయితే, ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్లో చేరుతున్నారు.
2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి ఎక్కువ స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందారు. కానీ ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు చేరారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూడా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయన్న పార్టీ వీడటం చర్చనీయాంశమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో, ఓటుకు నోటు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దోస్తీ అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్కు తామే బలమైన పోటీ అని, 2019 ఎన్నికల్లో తమ గెలుపు ఎవరూ ఆపలేరని టిడిపి నేతలు చెబుతున్నారు.
మరోవైపు, ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎంల మధ్య దోస్తీ కుదిరింది! ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అనంతరం ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు కనిపించాయి. ఆ తర్వాత కొన్ని నెలలకు వారి మధ్య గొడవలు సమసిపోయాయి.

అందుకు, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు... ఇలా ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఊహాగానాలు ఏమైనప్పటికీ చంద్రబాబు తెలంగాణను పక్కన పెట్టారని కొందరు టిడిపి నేతల్లో అనుమానాలు కలుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఆంధ్రా పార్టీగా ముద్ర ఉన్నందున ఇక టిడిపికి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని భావిస్తున్నారని అంటున్నారు.
అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు... కెసిఆర్ను ఆహ్వానించడం, ఇప్పుడు కేసీఆర్ తాను నిర్వహించనున్న యాగానికి చంద్రబాబును పిలిచేందుకు సిద్ధపడటం, తెలంగాణ టిడిపి నేతలు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని, తన జోక్యం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు అంతర్గత భేటీల్లో చెప్పడం వంటి అంశాల నేపథ్యంలో టీడీపీని వదిలేందుకు కారణంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వలసలను టిడిపి గట్టిగా చెప్పలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరికలు ఉంటున్నాయి. కొత్త రాష్టమైనందున తాను ఏపీకే పరిమితం కావాల్సి ఉంటుందని చంద్రబాబు చెబుతుండటం కూడా కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications