స్నేహితుడితో లైంగిక దాడి చేయించి, డబ్బు తీసుకున్నాడు: భర్తపై ఫిర్యాదు
హైదరాబాద్: కట్టుకున్న భర్తనే తనను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితుడి చేత లైంగిక దాడి చేయించాడని ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఫిరోజ్ దంపతులు నివాసముంటున్నారు.
పెయింటర్గా పని చేస్తున్న తన భర్త ఫిరోజ్ ఈ నెల పదిహేనవ తేదీన తనను గచ్చిబౌలిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లి స్నేహితుడితో లైంగిక దాడి చేయించాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అనంతరం అతని వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో మౌనంగా ఉన్నానని ఫిర్యాదులో పేర్కొంది. నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల పరిధిలోని భుషణ్రావుపేట గ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజిరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు కోసం ఏడాది నుంచి 10 బోర్లు వేయించినా ఫలితం లేక పోయింది.
వర్షాభావంతో వేసిన పంటలు ఎండి పోయాయి. దీంతో అప్పుల బాధ పెరిగిపోయి మనస్థాపానికి గురైన రాజిరెడ్డి ఆదివారం ఉదయం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.