ట్విస్ట్: వజ్రాల వ్యాపారితో లింక్, అందుకే భార్యను టెక్కీ చంపేశాడు
హైదరాబాద్: భార్య సింధియాను కిరాతకంగా హత్య చేసిన టెక్కీ రూపేష్ ఉదంతంలో అసలు విషయం వెలుగు చూసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. భార్య సింధియా ఫ్రెంచ్ యువకుడితో వెళ్లిపోవడానికి నిర్ణయించుకోవడం వల్లనే సింధియా, రూపేష్ మధ్య గొడవలు జరిగినట్లు చెబుతున్నారు.
భార్యను చంపేసి ముక్కలు చేసి తగులబెట్టాడు
దక్షిణాఫ్రికాకు చెందిన సింధియాకు ఆ మధ్య ఓ ఫ్రెంచ్ యువకుడితో ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసింది. అతను మ్యారేజీ సర్టిఫికెట్ కూడా పంపించినట్లు తెలుస్తోంది. దానిపై సంతకం చేసి సింధియా వెనక్కి పంపించాల్సి ఉంది. ఈ సమయంలో ఆదివారం రాత్రి రూపేష్కు, సింధియాకు మధ్య గొడవలు జరిగినట్లు చెబుతున్నారు.
సింథియా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి ఫ్రాన్స్లో వజ్రాల వ్యాపారి అని, అతని పేరు కీనౌనీ కమితాబ్ అని పోలీసాఫీసరు సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.
కూతురు సానియాను తీసుకుని వెళ్లిపోతానని సింధియా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. కూతుర్ని తన వద్దే ఉంచుకుంటానని రూపేష్ చెప్పాడని, అందుకు సింధియా అంగీకరించలేదని, దాంతో గొడవ తీవ్రమైందని అంటున్నారు. ఈ స్థితిలో రూపేష్ తొలుత సింధియా గొంతు నులిమాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేశాడు.
సోమవారం ఉదయం కూతుర్ని రూపేష్ పాఠశాలకు పంపించాడు. ఆ తర్వాత భార్య శవాన్ని ముక్కలుగా నరికి బ్యాగులో కుక్కాడు. సాయంత్రం కూతుర్ని తీసుకుని కారులో ఆ బ్యాగ్ ఉంచుకుని శంషాబాద్ మండలంలోని మదనపల్లికి వచ్చాడు. అక్కడ బ్యాగ్ను దించి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
శంషాబాద్ వద్ద యూటర్న్ తీసుకుని అక్కడికి వచ్చిన రూపేష్ అదే దారిలో తిరిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, కారు బురదలో కూరుకుపోయింది. ఇది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది. దాంతో స్థానికులు సాయం చేయడానికి వచ్చి మంటలను చూసి అనుమానించారు. క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు వచ్చినట్లు తొలుత భావించినప్పటికీ అది నిజం కాదని తేలింది.
పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రూపేష్ను ప్రశ్నించారు. దాంతో మంటల్లో కాలుతున్న మృతదేహం తన భార్యదేనని రూపేష్ చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతని కూతురు సానియాను బంధువులు తీసుకుని వెళ్లారు.