కేసీఆర్ మద్దతు ఎవరికి - కాంగ్రెస్ తోనే ఇరకాటం: భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా...!!
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పైన గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని కేసీఆర్ శపథం చేసారు. దీని కోసం జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలతో మందుకు వెళ్లేందుకు సిద్దమని చెప్పారు. ఈ మైత్రిలో భాగంగానే ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు మద్దతు ప్రకటించారు.
ఆయన నామినేషన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆ తరువాత సిన్హా హైదరాబాద్ వచ్చిన వేళ..సీఎం కేసీఆర్ స్వాగతం పలికి ఆతిధ్యం ఇచ్చారు. ఇక, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వా నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ హాజరు కాలేదు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థమేనా
అసలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అనే అంశం పైన క్లారిటీ లేదు. దీని పైన పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీలు చెబుతున్నారు. కానీ, ఈ నిర్ణయం తీసుకోకపోవటం వెనుక అసలు కారణం అక్కడే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సమయంలోనే కేటీఆర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అయినా, కేటీఆర్ తాము అభ్యర్ధికి మద్దతిస్తున్నామని, కూటమిలోని అన్ని పార్టీలకు కాదని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ అభ్యర్ధి రేసులో ఉండటంతో టీఆర్ఎస్ మద్దతు అంశం చిక్కుముడిగా మారింది.
కాంగ్రెస్ నేత బరిలో ఉండటంతో
తెలంగాణలో బీజేపీ -కాంగ్రెస్ తో పోరాడుతున్న టీఆర్ఎస్.. ఢిల్లీలోనూ ఆ రెండు పార్టీలకు సమ దూరమని తేల్చి చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్వయంగా కాంగ్రెస్ నేత అభ్యర్ధిగా ఉండటంతో నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లోనూ అటు ఎన్డీఏ - ఇటు విపక్షాలు ఎంపిక చేసిన కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
దీంతో..ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్ధి సమయంలో సీఎం కేసీఆర్ తో విపక్షాల కూటమి కీలక నేత శరద్ పవార్ ఫోన్ చేసి చర్చించారు. మద్దతు పైన మాట్లాడారు. వెంటనే కేసీఆర్ సైతం ఓకే చెప్పారు. అయితే, ఈ సారి మాత్రం కేసీఆర్ తో చర్చించారా లేదా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా
రేపు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 25న నూతన రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక, ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. కానీ, ఎన్డీఏకు వ్యతిరేకంగా పోటీ పెట్టటం ద్వారా పార్టీల మధ్య ఐక్యత ..భవిష్యత్ సంబంధాలు..సార్వత్రిక ఎన్నికల దాకా కలిసి సాగాలనే లక్ష్యంతో పోటీ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ తమ విధానం ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. తటస్థంగా ఉండే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.