పాలేరు గడ్డపై పులివెందుల బిడ్డ -పోటీకి వైఎస్ షర్మిల సై -పార్టీలోకి మాజీ డీజీపీ! -ఖమ్మం సభ ఎలా?
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తోన్న వైఎస్ షర్మిల తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ' అనే పేరుతోపాటు విధివిధానాలు, అజెండాను ప్రకటించడం కోసం ఖమ్మంలో తలపెట్టిన భారీ బహిరంగ సభపై ఆమె కసరత్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో భేటీ సందర్భంగా పోటీ విషయాన్ని షర్మిల వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

పులివెందుల -పాలేరు
షెడ్యూల్ ప్రకారమైతే 2023లో, జమిలి ఎన్నికలుగానీ వస్తే అంతకంటే ముందే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని ఆమె పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నేతలతో బుధవారం సమావేశమైన ఆమె ఈ మేరకు తన భవిష్యత్ కార్యాచరణను వివరించారు. అయితే..

ఖమ్మం సభ ఉంటుందా?
షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు సంబంధించి ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతినిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే? ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు. ఖమ్మంలో సభ నిర్వహణ నేపథ్యంలో మైదానానికి ఇప్పటికే అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సభను జరుపుతామని షర్మిల పార్టీ నేతలు చెబుతున్నా, కరోనా ఆంక్షలు విధిస్తే గనుక ప్రణాళిక తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక,

షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీగా పని చేసిన స్వర్ణజీత్ సేన్ భార్య అనితా సేన్ బుధవారం వైఎస్ షర్మిలతో లోటస్ పాండ్లో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. షర్మిల కొత్త పార్టీకి సేన్ సలహాదారుడిగా పనిచేసే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ హయాంలో పని చేసిన మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చాలా మంది షర్మిలను కలిసి మద్దతు ప్రకటిస్తుండటం, ఇద్దరు మాజీ అధికారులకు పార్టీ పదవులు కూడా ఇవ్వడం తెలిసిందే. సీపీఎం నేత ఎస్ నాగేశ్వరరావు కూడా బుధవారం షర్మిలను కలిశారు.












Click it and Unblock the Notifications