జగన్ ‘మా’ ఎన్నికలకు వస్తారా -కేటీఆర్ ఫ్రెండ్ అవుతారా : ఒళ్లు దగ్గర పెట్టుకో -ప్రకాశ్ రాజ్ సంచలనం..!!
"మా" ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ తన స్వరం పెంచారు. ఎన్నికల్లో తన ప్రత్యర్ధి విష్ణు తో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న నరేశ్ పైన ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో జగన్..కేటీఆర్ పేర్లను ప్రస్తావించారు. తనకు ఏ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదని..తన సత్తాతోనే తాను ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. పెద్దోళ్లుగా చెప్పుకుంటున్న వారికి ప్రశ్నించే సత్తా ఉన్నవారే "మా" అధ్యక్షుడు కావాలని స్పష్టం చేసారు. ఎవరి కరుణా కటాక్షాలతో పదవి దక్కితే వారి దగ్గరకు వెళ్లి కూర్చోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. "మా" తాజా - మాజీ అధ్యక్షుడు నరేశ్ పైన తీవ్రంగా స్పందించారు.
నరేశ్ ఒళ్లు దగ్గర పెట్టుకో
తను మాట్లాడినంత ధారాళంగా ఆ ప్యానెల్ లో ఎవరైనా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. రాసిచ్చనది చదవటం కాదని... సొంతంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు. తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్లో ఎవరికి రాదంటూ చురకలు వేసారు. తనను పెంచింది తెలుగు భాషే అంటూ చెప్పారు. నరేశ్ అహంకారి అని వ్యాఖ్యానించిన ప్రకాశ్ రాజ్... ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. "మా" సిగ్గుపడేలా నరేశ్ వ్యవహరిస్తున్నారని .. సభ్యులు కోపంతో..బాధతో వేసే ఓట్ల సునామీలో విష్ణు కొట్టుకుపోవాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు.
వాళ్లకేనా..మాకు క్రమశిక్షణ లేదా
"మా" ఎన్నికల పైన తనను బెదిరించారని..తాను ఒక లేఖ రాస్తే "మా" కార్యాలయం మూతపడేదన్నారు. తనకు సౌమ్యం గానే కాదు.. కోపంగానూ మాట్లాడటం తెలుసంటూ ప్రకరాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. తాను 'మా' అసోసియేషన్ కోసం బాధ్యతతో పనిచేయాలని వచ్చానని చెప్పారు. ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉందని చెబుతున్నారని..మనకు క్రమశిక్షణ లేదా అంటూ ప్రశ్నించారు. తాను కర్ణాటక..తమిళనాడు చూసి..ఇప్పుడు ఏపీలో చూస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లోకి ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్...బీజేపీలను ఎందుకు లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
జగన్ మీ బంధువైతే వస్తారా
జగన్ మీ బంధువైతే "మా" ఎన్నికలకు వస్తారా అంటూ ప్రశ్నించి కొత్త సంచలనానికి తెర లేపారు. అదే విధంగా రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా అంటూ నిలదీసారు. గెలవటం కోసం ప్రయత్నాలు చేయండి అని చెబుతూనే ఎదుటి వారిని ఓడించటానికి కాదని చెప్పారు. తాము బాధతో..చాలా ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలనే పట్టుదలతో పోటీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తమకు పడే ఓట్ల సునామీతో విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
Recommended Video
ముదురుతున్న "మా" వార్..
ఇప్పటి వరకు తాను చాలా ఓపికగా అన్నింటికి సమాధానం చెప్పినా.. ఇంకా కొందరు అహంకారంతో విమర్శలు చేస్తున్నారని..తనకు అదే తరహాలో సమాధానం చెప్పటం తెలుసని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. సరిగ్గా "మా" ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. దీంతో.. రెండు ప్యానళ్ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల పైన విష్ణు- నరేశ్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.