అన్నారు గానీ జగన్ తెలంగాణలో పర్యటిస్తారా: కెసిఆర్కు చిక్కులా?
తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు.
హైదరాబాద్: తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. వనపర్తి జిల్లా పెబ్బేరు 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు మీదుగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆయన ఆ మాట అన్నారు.
అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం చెప్పాయి. వనపర్తి, పెబ్బేరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి జగన్కు పూలమాల వేశారు.
తిరిగి అదే పూలమాలను ఆయనకు వేసి విష్ణూ! బాగున్నావా? అని పలకరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎండి ,పీ, చంద్రశేఖర్ యాదవ్, కన్వీనర్ దేవాచారి, చంద్రశేఖర్, బాలరాజు, చలం తదితరులు పాల్గొన్నారు.
నిజంగానే అన్నారా...
తాను తెలంగాణలో పర్యటిస్తానని జగన్ అన్నారు గానీ ఆ పనిచేస్తారా అనేది సందేహమే. ఆయన గురి ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై ఉంది. ఎపిలో అధికారంలోకి రావాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. అందువల్ల ఆయన తెలంగాణలో పర్యటిస్తారా అనేది సందేహమే. తెలంగాణను ఆయన దాదాపుగా వదిలేశారనే అందరూ భావిస్తున్నారు. ఆయన మాటను తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందా అనేది ప్రశ్న.
Recommended Video
ఇలా అనుకుంటున్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జగన్కు రహస్య అవగాహన ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. అది ఎంత వరకు నిజమనేది తెలియదు గానీ అది ప్రచారంలో బలంగానే ఉంది. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించేందుకే జగన్ తన పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపారనే అభిప్రాయం కూడా ఉంది. అందువల్ల ఆయన తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం లేదని అంటున్నారు.
ఈ స్థితిలో జగన్ అడుగేస్తే....
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే, జగన్ పర్యటిస్తే అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు. తెలంగాణలో వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు దండిగానే ఉన్నారు. వారంతా జగన్ వెంట నడిచే అవకాశాలు లేకపోలేదు. పైగా, సామాజిక వర్గం బలం కూడా తోడు కావచ్చు. గతంలో లేని విధంగా తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం, వైరుధ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది జగన్కు అనుకూలంగా మారవచ్చు. దానికితోడు, అటు తెరాసలోకి వెళ్లలేక, కాంగ్రెసులో ఇమడలేక సతమవుతున్న నాయకులు చాలా మందే తెలంగాణలో ఉన్నారు. వారంతా జగన్కు అండగా నిలిచే అవకాశాలున్నాయి.
నష్టం ఎవరికి, లాభం ఎవరికి....
జగన్ తెలంగాణలో కాలు పెట్టి, ఇక్కడి రాజకీయాలను తీవ్రంగా పరిగణించి ఉనికి చాటుకోవాలనే ప్రయత్నం చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుందనేది అసలు సిసలు ప్రశ్న. కాంగ్రెసును ఇది తీవ్రంగా నష్టపరుస్తుందని చెప్పవచ్చు. జగన్ మూలాలు కాంగ్రెసులో ఉండడమే అందుకు ప్రధాన కారణం. అయితే, కెసిఆర్కు కూడా తిప్పలు తప్పకపోవచ్చే. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు వైసిపిని ఆశ్రయించవచ్చు.