కేసీఆర్ చీకటి దందాలు, వారి వల్లే శాంతిభద్రతలకు భంగం: యాత్ర ఆగదన్న బండి సంజయ్
కరీంనగర్: ప్రజాసంగ్రామ యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ మరో కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా కరీంనగర్లో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video
కవితపై ఆరోపణలు రావడం వల్లేనంటూ బండి సంజయ్
బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రజాసంగ్రామ యాత్రను కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకే యాత్ర చేపట్టామని.. ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదన్నారు. లిక్కర్ స్కాంలో కవితపై వచ్చిన ఆరోపణల దృష్టి మళ్లించేందుకే తమ యాత్ర అడ్డుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్ చీకటి దందాలు బయటపడతాయనే దాడులు: బండి సంజయ్
తన బిడ్డను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం డైరెక్షన్లోనే ప్లాన్ చేశారన్నారు. పాదయాత్రలో సీఎం కేసీఆర్ చీకటి దందాలన్నీ బయటపెడుతున్నామనే తట్టుకోలేక దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామయాత్ర ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు.
కేసీఆర్ కుటుంబమే శాంతిభద్రతలకు విఘాతం: బండి సంజయ్
కేసీఆర్ సర్కారు అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగాచేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయని బండి సంజయ్ తెలిపారు. ఏదో ఒక సాకుతో యాత్రను ఆపాలని కుట్ర చేశారన్నారు. ప్రజలను కలిసి పేదల బాధలు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌస్, ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని విమర్శించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం కుటుంబమే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలను పిలిచి రాళ్లు, రాడ్లతో దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
పాదయాత్ర ఆగదంటూ బండి సంజయ్
తమ ఊపిరి ఉన్నంత వరకు యాత్ర చేసి తీరుతామని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్.. జేజమ్మలు వచ్చిన పాదయాత్ర ఆగదని తేల్చి చెప్పారు. మరోవైపు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ పార్టీ ముఖ్యనేతలు నిరసన దీక్షకు దిగారు.
ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, సినీనటి జీవితా రాజశేఖర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకునే చర్యలు దిగుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.