వెరుపులేని రాజకీయమా?, వెనక్కి తగ్గడమా?: రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే!..
ఒకవేళ ఉపఎన్నికకు దిగి గెలిస్తే మాత్రం రేవంత్ పొలిటికల్ మైలేజీ మరింత పెరుగుతుంది. కాంగ్రెస్ లోను ఆయనకు లభించే ప్రాధాన్యం రెట్టింపవుతుంది.
హైదరాబాద్: నేతల రాజకీయం ఎప్పుడు రంగు మార్చుకుంటుందో చెప్పడం కష్టం. అనిశ్చితికి కేరాఫ్గా ఉండే రాజకీయాల్లో ఏ మాటా శాశ్వతం కాదు. ఏ విషయంలో అయితే ప్రత్యర్థిని విమర్శించారో.. అది తమదాకా వచ్చినప్పుడు మాటా మార్చేసేవారే ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు.
ఏంటిదంతా?: రేవంత్ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలోను ఇప్పుడిదే జరుగుతుందా? అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన నేతలను అప్పట్లో ఓ రేంజ్లో విమర్శించిన రేవంత్.. ఇప్పుడు తాను పార్టీ మారి వాళ్లకూ అదే అవకాశం ఇస్తారా?, లేక రాజీనామా చేసి ఉపఎన్నికకు సిద్దపడుతారా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
వెల్కమ్ వ్యూహం: ఎమ్మెల్యే టిక్కెట్లలో కోటా పెంచాలి, కెసిఆర్ను కోరిన తుమ్మల?
సాగనంపడమో.. రాజీనామానో!:
టీటీడీపీ నుంచి రేవంత్ను సాగనంపడమో.. లేక ఆయనే రాజీనామా చేయడమో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి రాగానే ఈ విషయంలో దాదాపుగా స్పష్టత వచ్చేస్తుంది. తనపై వేటు పడుతుందన్న సూచనలు ముందుగానే పసిగడితే.. రేవంతే రాజీనామాకు సిద్దపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రేవంత్ రాజకీయం టీడీపీ కాంపౌండ్ దాటి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
వెళ్తారు సరే, రాజీనామా!:
టీటీడీపీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కోసం ఆ పార్టీ నేతలు కచ్చితంగా పట్టుబడుతారు. అదే సమయంలో పార్టీ ఫిరాయింపులపై గతంలో రేవంత్ విమర్శలను ఎదుర్కొన్న నేతలు కూడా ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతారు. ఎప్పుడూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండే రేవంత్ రాజీనామా విషయంలోను అదే దూకుడు ప్రదర్శిస్తారా?.. లేక ఎలాగూ మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్నది చూడాలి.
అప్పట్లో ఫిరాయింపులపై సుప్రీంకు?:
టీటీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నేతలపై అప్పట్లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఆయన కూడా గులాబీ గూటికి చేరడంతో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో పిటిషన్ లో ఇంప్లీడ్ అయేందుకు రేవంత్ ప్రయత్నించి విఫలమయ్యారు. కారణం.. తెలుగుదేశం అధినాయకత్వం నుంచే ఆదేశాలు రావడంతో ఆయన ఢిల్లీ దాకా వెళ్లి సుప్రీంలో పిటిషన్ వేయకుండానే తిరిగొచ్చారు.
బాబుతో విభేదాలు!:
సంతల్లో పశువుల్లా కేసీఆర్ టీడీపీ నాయకులను కొంటున్నారని మొదట్లో గట్టిగానే విమర్శలు చేసిన చంద్రబాబు.. రాను రాను స్వరం పూర్తిగా తగ్గించేశారు. ఏపీలోను ఫిరాయింపుల పర్వాన్ని ఆయన ట్రాక్ ఎక్కించడంతో తెలంగాణలో ఫిరాయింపులను విమర్శించలేని స్థితిలోకి నెట్టివేయబడ్డారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయించినవారిని 'వ్యభిచారులు'గా అభివర్ణిస్తూ తన విమర్శలను అలాగే కొనసాగిస్తూ వచ్చారు. తాను స్వయంగా కల్పించుకున్నా రేవంత్ ఆ విమర్శలను మానకపోవడంపై అప్పటినుంచే చంద్రబాబుకు రేవంత్పై అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది.
తనను కట్టడి చేయాలని చూడటం రేవంత్ కు నచ్చకపోవడం.. తన మాట వినట్లేదన్న భావనతో చంద్రబాబుకు సైతం రేవంత్ అంటే కొంత అసంతృప్తి ఏర్పడటం.. ఇద్దరిలోను ఒకరి పట్ల ఒకరికి అంతర్గత విభేదాలకు తావిచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వెరుపులేకుండా అడుగేస్తారా?:
ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేవంత్.. టీడీపీ నుంచి బయటకొచ్చి ఉపఎన్నికకు సిద్దపడితే ఆయన దూకుడు నిలుపుకున్నవారవుతారు. లేనిపక్షంలో రేవంత్ అభద్రతా భావంలో ఉన్నాడన్న అభిప్రాయాలు బలపడుతాయి. ఒకవేళ ఉపఎన్నికకు దిగి గెలిస్తే మాత్రం రేవంత్ పొలిటికల్ మైలేజీ మరింత పెరుగుతుంది.
కాంగ్రెస్ లోను ఆయనకు లభించే ప్రాధాన్యం రెట్టింపవుతుంది. అదే సమయంలో ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బకొట్టడం ద్వారా కేసీఆర్ సర్కారు పతనం మొదలైందని రేవంత్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్తారా?.. లేక వెనక్కి తగ్గుతారా? అన్నది వేచి చూడాలి.
రాజీనామా ఆమోదిస్తారా?:
రేవంత్ రాజీనామా విషయం టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను స్పీకర్ ఇంతవరకు ఆమోదించలేదు.
ఈ నేపథ్యంలో రేవంత్ రాజీనామాను ఆమోదిస్తే.. తలసాని రాజీనామాపై కూడా తేల్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. తలసాని రాజీనామాను ఎటూ తేల్చకపోవడంపై అప్పట్లోనే రాష్ట్రపతి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాబట్టి రేవంత్ రాజీనామాపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, రేవంత్ టీడీపీని వీడటం ఖాయమైతే ఆయనతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మిగిలేది ఒక్క ఆర్.కృష్ణయ్య మాత్రమే. పేరుకే టీడీపీ అయినా ఆయన్ను పార్టీ నేతగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్కు కట్టబెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.