లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలు
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి దూకుడు మీదున్న టీఆర్ఎస్ పార్టీ .. మెజార్టీ పార్లమెంట్ సీట్లపై కన్నేసింది. ఎంఐఎంతో కలిసి మొత్తం 17 సీట్లు గెలిస్తే ... కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తోన్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యుహరచన చేశారు.
6 నుంచి సన్నాహాక సమావేశాలు
ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఈ సమావేశాలు నిర్వహించాలి. కానీ సరిహద్దులో ఉద్రిక్త నేపథ్యంలో షెడ్యూల్ ను మార్చారు. మొత్తం 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తామని .. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పళ్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
11 రోజులు 9 నియోజకవర్గాలు
ఆరో తేదీన ప్రారంభమయ్యే సన్నాహాక సమావేశాలు ఈ నెల 17న ముగుస్తాయి. ఈ సమావేశాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు, ఆరో తేదీన కరీంనగర్, ఏడో తేదీన వరంగల్, భువనగిరిలో .. 8న మెదక్, మల్కాజిగిరి, 9న నాగర్ కర్నూలు, చేవెళ్ల, 13న జహీరాబాద్, సికింద్రాబాద్, 14న నిజామాబాద్, ఆదిలాబాద్, 15న పెద్దపల్లి, రామగుండం, 16 మహబూబాద్, ఖమ్మం, 17న నల్గొండ, మహబూబ్ నగర్ లో సమావేశాలు నిర్వహించి ... ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై దిశానిర్దేశం చేస్తారు.
అసెంబ్లీ ఎన్నికల జోష్ ..
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. 88 సీట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. టీఆర్ఎస్ 16, ఎంఐఎం 1 సీటు మొత్తం 17 సీట్లు గెలువాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు మద్దతు రాదనే ఊహాగానాల నేపథ్యంలో .. ఫెడరల్ ఫ్రంట్ కు అంకురార్పణ చేసి కీ రోల్ పోషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.