అరాచకం : లాక్ డౌన్లోనూ ఆగని లిక్కర్ దందా.. మందుబాబులకు షాకిచ్చే రేట్లు..
లాక్ డౌన్ వేళ మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రెస్మీట్లలో స్వయంగా తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ కొంతమంది మద్యం విక్రయదారులు బ్లాక్ దందాకు తెరలేపారు. పలువురు మద్యం దుకాణాల యజమానులు,బార్లు,రెస్టారెంట్ల యజమానులు నమ్మకస్తులను ఏజెంట్లుగా నియమించుకుని యథేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలో ఓ వ్యక్తి తన కారులో అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.
నాలుగైదు రెట్లు పెంచి.. మందు బలహీనతపై దెబ్బ..
లాక్ డౌన్ వేళ మందుబాబులు చుక్క లేక అల్లాడిపోతున్నారు. మద్యం అలవాటు కొంతమందిలో మానసిక సమస్యలు తెస్తుంటే.. మరికొంతమందిని కుదురుగా కూర్చోనివట్లేదు. ఎక్కడ మద్యం దొరుకుతుందా అని తమకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందు బాబుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొంతమంది వైన్ షాప్స్,బార్ల యజమానులు రెచ్చిపోతున్నారు. మద్యాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించి సాధారణ రేటు కంటే నాలుగైదింతలు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.120-రూ.180 మద్యం బీర్ ఇప్పుడు ఏకంగా రూ.450-రూ.500కి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
నగరంలో పలుచోట్ల.. కొన్ని జిల్లాల్లోనూ..
ఇటీవల మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు నగరంలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో రహస్య మద్యం విక్రయాలను బట్టబయలు చేశారు. మల్కాజిగిరి పటేల్నగర్,ఆదర్శ్ నగర్,కుషాయిగూడ,ఏఎస్ రావు నగర్,కీసర ఎస్వీ నగర్,హేమ నగర్,శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో మద్యం విక్రయాలను బట్టబయలు చేశారు. అల్వాల్ ప్రాంతంలోని ఓ వైన్స్ షాపు నుంచి ఒకటి,రెండురోజుల వ్యవధిలో ఘట్ కేసర్ ప్రాంతానికి మద్యం తరలించి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో కర్ణాటక నుంచి తీసుకొచ్చి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.140 విలువ చేసే ఒక్క క్వార్టర్ సీసాను రూ.600కి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసినా.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు తెరపడలేదనే ప్రచారం జరుగుతోంది.
ఇలా విక్రయాలు...
లాక్ డౌన్ వేళ ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్స్,బార్లు,రెస్టారెంట్లకు ఎలాంటి సీల్ వేయకపోవడం బ్లాక్ దందాకు తెరలేపింది. చాలాచోట్ల అర్ధరాత్రి వేళ షాపుల తాళాలు తీసి మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. వీటిని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లలో నిల్వ చేస్తూ బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇందుకోసం తమకు నమ్మకంగా ఉండే విద్యార్థులను,యువకులను ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరికి ఒక్కో బాటిల్పై రూ.200-రూ.500 వరకు కమిషన్ దక్కుతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీల ద్వారా ముందే డబ్బు తీసుకుని అవసరమైన వాళ్లకు మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం.