ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు: కనిపించకుండా పోయాడు
హైదరాబాద్: అతను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన బిడ్డను తీసుకుని కనిపించకుండా పోయాడు. దాంతో అతని భార్యలు ఇంటి ముందు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
హైదరాబాదులోని చిక్కడపల్లి బాగ్లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్లో ఉండే సత్యనారాయణ వృత్తి రిత్యా కారు డ్రైవర్. 1996లో అబిడ్స్కు చెందిన ఎస్ రాజేశ్వరిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వారికి 1997లో కుమారుడు జన్మించారు. అయితే పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానంతో రాజేశ్వరిని కుమారుడిని వదలి పెట్టి వెళ్లిపోయాడు.
చాలా కాలం తర్వాత విడాకులు కావాలని రాజేశ్వరి పై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో సత్యనారాయణ కోర్టును ఆశ్రయించాడు. పలుసార్లు నోటీసులు కూడా పంపించాడు. తాను విడాకులు కోరడం లేదని కలిసి ఉండాలని ఆమె తెలిపింది. రాజేశ్వరికి పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదని భర్త ఆరోపించిన్నట్లు ఆమె తెలిపింది.
ఆమె ఈ విషయాన్ని అప్పట్లో పోలీసుల దృష్టికి తెచ్చింది. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేయిస్తామని పోలీసులు హెచ్చరించడంతో భార్యతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. భర్త పై ఏమాత్రం నమ్మకం లేని రాజేశ్వరి కోర్టు ద్వారా తనను తీసుకెళ్లాలని తేల్చి చెప్పింది. భయపడ్డ సత్యనారాయణ భార్య పిల్లలను వదలి పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్య దగ్గరకు అప్పుడప్పుడు వచ్చేవాడు. కూలీనాలీ చేసుకుంటూ రాజేశ్వరి తన కుమారుడి పెంచి పెద్దగా చేసింది.
ఆ తర్వాత చాలా రోజులు భార్యకు దూరంగా ఉన్న సత్యనారాయణ మొదటి పెళ్లి విషయాన్ని చెప్పకుండా జియాగూడకు చెందిన మోనికను కూడా 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం అయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మోనిక తప్పని పరిస్థితిలో చేసేది లేక భర్తలో మార్పు వస్తుందనే ఆశతో కాపురం చేసింది.
కొన్ని రోజుల భర్త వేధించడం, భర్త సోదరీలు చిన్న చిన్న విషయాల పై అగ్రహం వ్యక్తం చేయడం, తిట్టడం లాంటివి చేసేవారు. ఈ క్రమంలోనే మోనికకు ఓ పాప పుట్టింది. ఆ పాపను భార్యకు చెప్పకుండా రెండు నెలల క్రితం ఎత్తుకెళ్లాడు.
ఈ విషయం పై ఎన్ని సార్లు ప్రశ్నించినా సత్యనారాయణ కుటుంబ సభ్యుల నుంచి సమాధానం రాలేదు. స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా భర్త, పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో మోనిక, రాజేశ్వరీ ఆదివారం భర్త ఇంటి ముందు ధర్నా చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులు తాళం వేసి పారిపోయారు.