నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కార్తీక్: ఆస్పత్రిలో సంధ్యారాణి మృతి, ‘ప్రేమ వేధింపులు’
Recommended Video
హైదరాబాద్: నగరంలో గురువారం జరిగిన దారుణ ఘటన విషాదాంతమైంది. సికింద్రాబాద్లోని లాలాగూడలో నడుచుకుంటూ వెళ్తున్న సంధ్యారాణి(22)పై కార్తీక్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు.
సంధ్యారాణితో ఐదేళ్ల ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే..: కార్తీక్, 'అవారా' అన్న డీసీపీ
స్థానికుల సమాచారంతో అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున సంధ్యారాణి మృతి చెందింది. సంధ్యా రాణి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తల్లి అక్కతో కలిసి లాలాగూడలో..
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... బాధితురాలు నేరెడు సంధ్యారాణి(22) తల్లి సావిత్రి, సోదరులు, అక్కతో లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది.
కార్తీక్తో పరిచయం
కాగా, రెండేళ్ల నుంచి నిందితుడు కార్తీక్తో సంధ్యారాణికి పరిచయం ఉంది. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు కూడా. అయితే, గత కొంతకాలంగా ఉద్యోగం మానేసిన కార్తీక్.. చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సంధ్యారాణి.. కార్తీక్ను దూరం పెట్టింది.
ప్రేమ వేధింపులు.. నిప్పంటించాడు
అయితే, ప్రేమ, పెళ్లి అంటూ సంధ్యారాణిని కార్తీక్ వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు కార్తీక్. దుకాణంలో పని పూర్తయ్యాక గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణితో కార్తీక్ గొడవకు దిగాడు. ఆ తర్వాత ముందె తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించాడు.
సంధ్యారాణి ఆర్తనాదాలు
మంటలకు తాళలేక సంధ్యారాణి కుప్పకూలిపోగా.. స్థానికులు పాత దుస్తులను ఆమెపై కప్పి మంటలను ఆర్పారు. సమాచారం తెలుసుకున్న సంధ్య తల్లి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సంధ్యారాణిని అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో సంధ్యారాణి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడ్ని కూడా ఇలాగే చంపేయాలంటూ డిమాండ్ చేశారు. సంధ్యారాణి అక్కకు పెళ్లి చేసిన తర్వాత ఈమెకు కూడా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండగానే ఈ దారుణం జరిగిందని కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు.
పోలీసులు అదుపులో హంతకుడు
కాగా, చనిపోయేముందు బాధితురాలు చెప్పిన సమాచారంతో నిందితుడు కార్తీక్ను అదుపులోకి తీసుకున్నామని ఉత్తర మండలం డీసీపీ బి.సుమతి తెలిపారు. నిందితుడు సంధ్య ఇంటికి సమీపంలోనే ఉంటున్నాడని గుర్తించారు. ఆమెకు నిప్పంటించే ముందు ఇద్దరూ కలిసి రహదారిపై గొడవ పడుతూ వస్తున్నారంటూ స్థానికులు సమాచారమిచ్చారు. కాగా, సంధ్యారాణి చాలా మంచిదని ఇంటిపక్కవారు చెబుతున్నారు. తండ్రి లేకపోవడంతో తల్లి, అక్కతో సంధ్యారాణి ఉంటోందని చెప్పారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సంధ్యారాణి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర చికిత్స చేయాల్సి ఉండగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.