మరో పెళ్లికి భర్త రెడీ, భార్య ఆత్మహత్య: కూతురి ప్రేమ పెళ్లి, తల్లి మృతి
నువ్వు అందంగా లేవు, నేను మరో పెళ్లి చేసుకుంటానని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్/ సిరిసిల్ల : భర్త రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భార్య మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉమాదేవి అనే మహిళ కొన్నేళ్ల క్రితం విజయవాడకు చెందిన కె.కృష్ణను పెళ్లి చేసుకుంది. ఆమె సంక్రాంతి పండుగకు మదుబన్ కాలనీలోని తల్లివారింటికి వచ్చింది.
శుక్రవారం మధ్యాహ్నం భర్త కృష్ణ భార్యకు ఫోన్ చేసి.. 'నువ్వు అందంగా లేవు, అందుకే రెండో పెళ్లి చేసుకుంటా' అని చెప్పాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురయిన ఉమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుంటే, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్లలోని సంజీవయ్యనగర్కు చెందిన ర్యాకం శోభ (45) కూలీ పని చేస్తుండగా, భర్త శంకర్ దుబాయ్లో పని చేస్తున్నాడు.
వారికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు తిరుమల, అదే కాలనీకి చెందిన గున్నాల కిరణ్ ప్రేమించుకున్నారు. శుక్రవారం ఉదయం వేములవాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొని సిరిసిల్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో మనస్తాపానికి గురైన శోభ బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.