చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన వివాహిత... భోరున విలపించిన పిల్లలు,భర్త...
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ వాగు ఉప్పొంగగా ఓ వివాహిత అందులో కొట్టుకుపోయింది. స్థానికుల సహాయంతో ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందింది. తన ఇద్దరు కుమార్తెలను రక్షించే క్రమంలో ఆమె వాగులో కొట్టుకుపోయినట్లు సమాచారం. తమ కళ్లెదుటే ఆమె వరదలో కొట్టుకుపోయి మృతి చెందడటంతో పిల్లలు,భర్త బోరున విలపించారు.

అసలేం జరిగింది...
వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన దశరథ్,అనితాభాయి దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. వ్యవసాయంపై ఆధారపడిన ఆ కుటుంబం బుధవారం(సెప్టెంబర్ 16) పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లింది. ఐదుగురు పిల్లలను వెంటపెట్టుకుని దశరథ్,అనితాభాయి చేను వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని సాయంత్రం 4గం. సమయంలో ఇంటికి బయలుదేరారు.

పిల్లలతో వాగు దాటుతుండగా...
ఆటోలో ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. షాపూర్ తండా సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆటో ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో దశరథ్,అనితాభాయి కిందకు దిగారు. ఇంటి వద్ద పని ఉందని.. త్వరగా వెళ్దామని అనితాభాయి దశరథ్తో చెప్పింది. దీంతో పిల్లల చేతులు పట్టుకుని జాగ్రత్తగా వాగు దాటే ప్రయత్నం చేశారు. ముగ్గురు మగపిల్లలను దశరథ్ చేతులు పట్టుకుని దాటించగా.. ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని అనితాభాయి వాగు దాటే ప్రయత్నం చేసింది.

గల్లంతు... మృతి...
కానీ వాగు ఉధృతికి ఇద్దరు కుమార్తెలు కిందపడిపోయారు. దీంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అనితాభాయి అందులోనే కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన దశరథ్ ఎలాగోలా కుమార్తెలను ఒడ్డుకు చేర్చగలిగాడు. అయితే అప్పటికే అనితాభాయి వరదలో గల్లంతయింది. కాసేపటికి స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి... ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ... అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. అనితాభాయి మృతితో ఆమె పిల్లలు,భర్త తీవ్రంగా రోధించారు. స్థానిక ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications