విషాదం : టీ తాగిన మహిళ మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం... అదే కారణం...?
జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అలవాటు ప్రకారం ఉదయాన్నే టీ తాగిన ఓ కుటుంబం అస్వస్థతకు గురైంది. ఇందులో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 'టీ'లో టీ పొడికి బదులు విషగుళికలు కలపడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో మంగళవారం(మార్చి 31) ఉదయం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో అంజమ్మ-దాసారం మల్లయ్య దంపతులు నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం అంజమ్మ,మల్లయ్య,మల్లయ్య సోదరుడు భిక్షపతి టీ తాగారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురినీ జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో... చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందారు.
ప్రస్తుతం మల్లయ్య,భిక్షపతి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 'టీ'లో టీ పొడికి బదులు పొరపాటున ఎండ్రిన్ విష గుళికలు కలపడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో అత్తింటి వేధింపులు భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.మృతుడిని వెంకటయ్య(37)గా గుర్తించారు. దోమ మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (37), జ్యోతి దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే వెంకటయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేదని భార్య జ్యోతి తరచూ గొడవపడేది. ఇదే విషయమై ఇటీవల దంపతులిద్దరికీ గొడవ జరిగింది.
భార్య జ్యోతి తన తమ్ముళ్లతో వెంకటయ్యపై దాడి చేయించింది. అనంతరం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.భార్య తనను వదిలి వెళ్లిపోవడం, బావ మరుదులు కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలం దగ్గర ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు బావమరుదులు దాడి చేయడం,భార్య వదిలి వెళ్లడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెంకటయ్య తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.