వివాహిత స్వాతి అనుమానాస్పద మృతి, రాజేంద్రనగర్లో తల్లీ కొడుకుల సజీవదహనం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. గత కొంతకాలంగా స్వాతి, ఆమె భర్త అనిల్ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో స్వాతి మంగళవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అదనపు కట్నం కోసమే స్వాతిని చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అనిల్, అత్త రాజ్యలక్మీ, మామ రామచంద్రరాజు, బావ కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
స్వాతి తోడికోడలు సుమబిందు ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
స్వైన్ ఫ్లూతో మహిళ మృతి
స్వైన్ ఫ్లూ వ్యాధితో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందింది. ఇక, కొత్తగా ఎనిమిది మందికి స్వైన్ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది. మరో 12 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
అగ్నిప్రమాదంలో తల్లీకొడుకులు సజీవదహనం
నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో గల మైలార్దేవ్పల్లిలో పరుపుల గోదాములో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. మృతులను షకీరా బేగం(35), అబ్బాస్(3)లుగా గుర్తించారు. ఇద్దరూ మంటల్లో పూర్తిగా కాలిపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల్లో మరో మహిళ కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది.