సోదరిలా చూసుకుంటానన్నాడు!.. నమ్మి వస్తే అత్యాచారం చేశాడు
హైదరాబాద్: బేగంపేటలోని అన్నానగర్ కాలనీలో అత్యాచార ఘటన వెలుగుచూసింది. మూర్చ వ్యాధి కారణంగా నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్న ఓ మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన రోహిత్ ఠాగూర్ కొన్నాళ్ల క్రితం కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన ఆమె భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో మాయ మాటలతో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చాడు.
సోదరిలా చూసుకుంటానని, హైదరాబాద్ లో కంప్యూటర్ కోర్సు నేర్పించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇదే క్రమంలో 10రోజుల క్రితం బేగంపేటలోని అన్నానగర్ కాలనీలో ఉన్న ఓ అద్దె ఇంట్లో దిగారు. యువతికి మూర్ఛ వ్యాధి ఉండటంతో నిద్ర మాత్ర వేసుకుని పడుకోవడం అలవాటైంది.
ఈ నెల 27న ఆమె నిద్ర మాత్ర వేసుకుని పడుకోగానే.. రోహిత్ ఠాగూర్ ఆమెపై అత్యాచారం జరిపాడు. మరుసటి రోజు ఇదే విషయంపై నిలదీయగా అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి 15 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.