'రాంగ్ కాల్' ప్రేమ: చెట్టాపట్టాలేసుకొని తిరిగారు, పెళ్లికి నో చెప్పిన ప్రియుడు
హైదరాబాద్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత వదిలేశాడని ఆరోపిస్తూ ఓ యువతి సికింద్రాబాద్లోని మారెడ్పల్లిలో ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఆమె గురువారం దీక్షకు దిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కొండాపూర్కు చెందిన శిరీష రాణి ఎంబీయే చదివింది. కొంతకాలం క్రితం ఆమె చేసిన ఓ రాంగ్ కాల్లో వెస్ట్ మారెడ్పల్లిలోని శేషాచల కాలనీకి చెందిన నితిన్ యాదవ్కు వెళ్లింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఏర్పడంది.
ప్రేమగా మారిన పరిచయం
శిరీష - నితిన్ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు చెట్టాపెట్టాలు వేసుకొని తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని మూడు నెలల క్రితం శిరీష అతనిని అడిగింది. అందుకు నితిన్ నిరాకరించాడు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా నో
శిరీష కుటుంబసభ్యులు నితిన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయినప్పటికీ నిరాకరించారు. దీంతో శిరీష గత నెల 14వ తేదీన మారెడ్పల్లి పోలీసులకు ప్రియుడి పైన ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు చెప్పినా అతను శిరీషను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
కేసు వాపస్ తీసుకుంటానన్నా
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నితిన్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే ఆ తర్వాత అతను బెయిల్ పైన విడుదలయ్యాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను కేసు వాపసు తీసుకుంటానని బాధితురాలి శిరీష చెప్పింది. అయినా నితిన్ అంగీకరించలేదు.
మహిళా సంఘాల మద్దతు
దీంతో ఆమె గురువారం అతని ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. మహిళా సంఘాల ప్రతినిధులు ఆమెకు అండగా నిలబడ్డారు. మరోవైపు నితిన్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. వారు ఎక్కడకు వెళ్లారో తెలియడం లేదు.
శిరీష దీక్షపై పోలీసులు
కాగా, శిరీష దీక్షపై పోలీసులు మాట్లాడుతూ.. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ను రిమాండుకు తరలించామని, అయినప్పటికీ ఆమె నిరాహార దీక్షకు దిగడం నిబంధనలకు విరుద్దమన్నారు. దీనకి తోడు శిబిరంలోని ఫ్లెక్సీలో నితిన్తో పాటు అతని కుటుంబ సభ్యులు ఫోటోలు ఉన్నాయని, అది సరికాదన్నారు. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.