video: భర్త లేని సమయంలో బావ లైంగిక వేధింపులు; సెల్ఫీ వీడియో తీసి వివాహిత ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరువు కోసం ఓ ఇల్లాలు ప్రాణాలే విడిచింది. బావ లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరీ ఉరివేసుకొని అరుణ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ కాపువాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బావ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వివాహిత
బావ కనకయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలు మృతురాలు అరుణ వెల్లడించింది. సెల్ఫీ వీడియో తో పాటుగా సూసైడ్ నోట్ కూడా రాసిన అరుణ తన మరణానికి గల కారణాన్ని వివరించింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి బావ కనకయ్య తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, తనను బెదిరిస్తున్నాడని అరుణ తన సెల్ఫీ వీడియోలో పేర్కొంది. తన గురించి తన భర్తకు, పిల్లలకు చెడుగా చెప్తానని వేధింపులకు పాల్పడుతున్నాడని, తనను బెదిరిస్తున్నాడని అరుణ రోదిస్తూ చెప్పింది.

పరువుగా బ్రతికానని సెల్ఫీ వీడియోలో వివాహిత ఆవేదన
వేధింపులు భరించలేక పోతున్నానని, మిషన్ కుట్టుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ పరువుగా బ్రతికాను అని, కరోనా మహమ్మారి బాగా ఉన్న సమయంలో కూడా తన బంగారాన్ని అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకున్నాను తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి దగ్గర అప్పు చేయలేదని అరుణ వెల్లడించింది. బావ కనకయ్యకు తాను లొంగడం లేదని, తనకు అప్పు ఇచ్చినట్లుగా అబద్ధం ఆడుతున్నాడు అంటూ అరుణ సెల్ఫీ వీడియో లో పేర్కొంది.

తాము అప్పు లేకున్నా అప్పు ఇచ్చినట్టు అబద్ధం ఆడుతున్నాడని ఆవేదన
తాను 30 వేల రూపాయలు కనకయ్యకు ఇవ్వాలని అబద్ధం ఆడుతున్నాడని అరుణ పేర్కొంది. తనను బాగా ఇబ్బంది పెడుతున్నాడని, ఎవరికీ చెప్పుకోలేక పోతున్నా అని అరుణ తన బాధను వ్యక్తం చేసింది. పరువు పోతుందని చనిపోవడానికి సిద్ధమయ్యానని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలిద్దరికీ అన్యాయం చేసి పోతున్నానని అరుణ కన్నీటి పర్యంతం అయ్యింది. మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మగా పుడతా అంటూ కూతురికి చెప్తూ రోదించింది. అన్నా చెల్లెలు ఒకరికొకరుగా బ్రతకాలంటూ అరుణ తన సెల్ఫీ వీడియో లో పేర్కొంది.
పిల్లలకు జాగ్రత్తగా బ్రతకాలని చివరి మాట
ఎవరి జోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలంటూ, పరువుగా బ్రతకాలంటూ పిల్లలకు చివరి మాటగా చెప్పిన బాధితురాలు, ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక పిల్లలు దీనంగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరువు పోతుందని క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లలను తల్లి లేని వారిగా చేసింది. లైంగిక వేధింపులకు గురి చేసిన బావ కనకయ్యను పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications