జికా వైరస్కు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్లో కనుగొన్నారు
హైదరాబాద్: ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న అత్యంత ప్రమాదకరమైన జికా వైరస్కు తొలి వ్యాక్సిన్ను కనుగొన్నట్లు భారతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్లో ఈ వ్యాక్సిన్ను తయారుచేసినట్లు తెలిపారు.
జికా వైరస్... దోమ ద్వారా వ్యాపిస్తుందని భావించినా, తాజాగా లైంగిక చర్య ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ వైరస్కు వ్యాక్సిన్ను కనుగొనేందుకు పరిశోధనలు జరపాలని ప్రపంచదేశాలను కోరింది.

ఈ నేపథ్యంలో జికా వైరస్కు తొలి వ్యాక్సిన్ను కనుగొన్నట్లు, దీని కోసం తొమ్మిది నెలల కిందటే పేటెంట్ తీసుకున్నట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా. కృష్ణ ఎల్లా తెలిపారు. అధికారికంగా దిగుమతి చేసుకున్న జికా వైరస్కు భారత్ బయోటెక్ ల్యాబ్లో వ్యాక్సిన్ కనుగొన్నామన్నారు.
ఇందులో రెండు అభ్యర్థుల టీకాలను కనుగొన్నామని, ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో పరీక్షలు జరపాల్సి ఉందన్నారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ చొరవ తీసుకుంటే నాలుగు నెలల్లో 10లక్షల వ్యాక్సిన్లను తయారుచేస్తామని ఆయన తెలిపారు. బ్రెజిల్ లాంటి దేశాలకు ఈ వ్యాక్సిన్ను ఎగుమతి చేస్తామన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తమకు సాయపడేందుకు ముందుకొచ్చిందని ఈ సందర్భంగా డా. కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. జికా వైరస్కు కనుగొన్న వ్యాక్సిన్పై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ వైరస్ను పరీక్షించాల్సి ఉందన్నారు.
ఈ పరీక్ష గనుక విజయం వంతం అయితే ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా ప్రాజెక్టుకు నిజమైన ఉదాహరణ అవుతుందన్నారు. మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్కు మన హైదరాబాద్లో వ్యాక్సిన్ కనుగొనడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.
జికా వైరస్పై అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో భారత కూడా అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాలకు గర్భిణిలు వెళ్ళకూడదని, ప్రయాణాలు వాయిదా లేదా రద్దు చేసుకోవాలని కోరింది.
దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ భారత వైద్య పరిశోధనా మండలి ఈ వైర్సకు సంబంధించి పరిశోధన చేపడుతుందన్నారు. ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో మానిటరింగ్ గ్రూప్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుందన్నారు.
దేశంలో జికా వైరస్ వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు డిల్లీలోని వ్యాధి నియంత్రణ జాతీయ కేంద్రం ఓ నోడల్ ఏజెన్సీలా పని చేస్తుందన్నారు. ‘దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా నివార ణ చర్యలు చేపడుతున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరంలేదు..' అని మంత్రి నడ్డా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications