తెలంగాణ కు కొత్త గవర్నర్..!! మాజీ ముఖ్యమంత్రికి బాధ్యతలు..!!
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారా. ప్రస్తుత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను మార్చబోతున్నారా. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ను ఆ తరువాత రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కంటిన్యూ చేసారు. 2019 వరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా..అమరావతి నుంచి పాలన ప్రారంభించింది.
తమిళిసై స్థానంలో కొత్త గవర్నర్..
దీంతో..ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించారు. తెలంగాణకు తమిళనాడుకు చెందిన తమిళసై సౌందర రాజన్ నియమితులయ్యారు. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 8న తమిళసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలను గవర్నర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకున్నా..కొన్ని సందర్భాలలో అధికారుల నుంచి సందేహాలను క్లియర్ చేసుకున్నారు. ఇక, ప్రతిపక్షాలకు సైతం అడిగిన ప్రతీ సందర్భంలోనూ తనను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం తమిళసై పాండిచ్చేరి రాష్టానికి సైతం ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.
పాండిచ్చేరీ పూర్తి స్థాయి బాధ్యతలు..
అయితే, కేంద్రంలో జరుగుతున్న గవర్నర్ల నియామకం చర్చల్లో భాగంగా.. తమిళసై ను పాండిచ్చేరికి పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణకు కొత్త గవర్నర్ పైన చర్చ సాగుతోంది. ఇందు కోసం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేరు ఖరారైందని విశ్వసనీయ సమాచారం. యడ్యూరప్ప తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. హైకమాండ్ సూచనల మేరకు రాజీనామా చేసిన యడ్యూరప్పకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని గతంలోనే బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది.
యడ్యూరప్పకు తెలంగాణ గవర్నర్ గిరీ..
ఇందులో భాగంగానే...తెలంగాణ గవర్నర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. విద్యార్ధి దశ నుంచే యడ్యూరప్ప 1970 నుంచే విద్యార్ధి దశలోనే ఆరెస్సెస్ విభాగంలో పని చేసారు. అక్కడి నుంచి క్రమేణా ఎదుగుతూ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా..మూడు సార్లు విపక్ష నేతగా పని చేసారు. బీజేపీ నుంచి బయటకు వెళ్లి..సొంత పార్టీ పెట్టినా తిరిగి కొంత కాలానికే సొంత గూటికి చేరారు. పార్టీలో మంచి నేతగా పేరున్న యడ్యూరప్పను కేంద్రం వ్యూహాత్మకంగానే ఇప్పుడు తెలంగాణకు ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
కేంద్రం సమాలోచనలు-త్వరలో నిర్ణయం
ఈ నెలాఖరులోగా యడ్యూరప్ప ను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వరకు తెలంగాణకు తొలి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ ..ప్రస్తుతం ఉన్న తమిళ సై ఇద్దరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఇక, ప్రచారం సాగుతున్నట్లు గా యడ్యూరప్పకు అవకాశం దక్కితే తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటకకు చెందిన వ్యక్తి గవర్నర్ కానున్నారు. తెలంగాణ రాజకీయాలు..అక్కడి వ్యవహారాల పైన పూర్తిగా అవగాహన ఉన్న యడ్యూరప్ప నూతన గవర్నర్ గా నియమితులు కానున్నట్లు ఢిల్లీలో బీజేపీ నేతలు చెబుతున్నారు.