ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఔదార్యం-అనాథ చిన్నారులకు అండగా-పూర్తి బాధ్యత తనదేనని..
ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అనాథలైన ఇద్దరు చిన్నారుల పట్ల తన ఔదార్యం చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల బాధ్యతను తానే తీసుకున్నారు. వారి చదువులతో పాటు ఆలనా పాలనా బాధ్యతలను తానే తీసుకున్నారు. చిన్నారులకు అన్ని విధాలా అండగా నిలబడుతానని... వారి పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే... ఇల్లందు పట్టణంలోని 17వ వార్డుకు చెందిన బట్టు గణేశ్-రావుల స్రవంతి కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గణేశ్ స్థానికంగా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కొన్నాళ్ల క్రితం గణేశ్ అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కష్టాల్లో పడింది.

అప్పటినుంచి స్రవంతి చిన్నా,చితకా పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. కానీ ఇంతలోనే విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. అనారోగ్యంతో ఇటీవల స్రవంతి కూడా మృతి చెందింది. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కి ఆ పిల్లల గురించి తెలుసుకోవాలని చెప్పారు.

మంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పిల్లల ఇంటికి వెళ్లి వారిని కలిశారు. ఆ ఇద్దరి పరిస్థితి తెలుసుకుని... వారి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నానని ప్రకటించారు.
ఇల్లందు పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో చిన్నారులకు ఒకటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరిసింగ్ నాయక్,వైస్ ఛైర్మన్ జానీ పాషా తదితరులు చిన్నారుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనాథ పిల్లలకు ఎమ్మెల్యే అండగా నిలబడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా,మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన దృష్టికి వచ్చే సమస్యలపై స్పందిస్తారన్న సంగతి తెలిసిందే. అనాథ పిల్లల పట్ల ఆయన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications