సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎన్ని మార్గాలో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, చెన్నైకి వెళ్లాలంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి మార్గం చీలిపోతుంది. శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి, నాయుడుపేట, సూళ్లూరుపేట మీదుగా చెన్నైకి చేరుకుంటారు. గూడూరుకు రావడానికి ఖాజీపేట, విజయవాడ, ఒంగోలు మీదుగా ఒక మార్గం ఉంది. అలాగే నల్గొండ, గుంటూరు, తెనాలి మీదుగా మరో మార్గం ఉంది. ఇవి కాకుండా జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకోవచ్చు. ఇవి కాకుండా మరో మార్గం ఉంది.
నడికుడి నుంచి కూడా మరో మార్గం
సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్లు, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, వికారాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఇలా నాలుగు మార్గాలున్నాయి. తాజాగా ఐదో మార్గం రాబోతోంది. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు జరుగుతున్న పనులు పూర్తికావొచ్చాయి. సికింద్రాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడికి చేరుకొని అక్కడి నుంచి వినుకొండ, దర్శి, కనిగిరి, రాపూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకోవచ్చు.

మొత్తం 6 మార్గాలు
ఏడుకొండలపై కొలువైన ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి రైల్వేద్వారా అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వస్తున్నాయి. ఇవి కాకుండా త్వరలోనే హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు మార్గం పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది కూడా పూర్తయితే మొత్తం 6 మార్గాలు అవుతాయి. మొన్నటివరకు ఒకే రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీలో ఒక నగరం నుంచి మరో నగరానికి చేరుకునేందుకు ఇన్ని రైల్వేమార్గాలున్న ఏకైక స్టేషన్ గా తిరుపతి నిలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం అరుదైన పరిణామంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications