వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి: మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత, మీడియాపై దాడి
హైదరాబాద్: కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన యువతి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, కవవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మల్లా రెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు దాడి చేశారు. దీంతో సూరారం పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్స కోసం ఓ యువతి మల్లారెడ్డి ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురై శనివారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో నలుగురు హైదరాబాదీల మృతి
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్ యూసుఫ్గూడకు చెందినవారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను భార్గవ్ కృష్ణ, ఆయన భార్య సంగీత, వారి కుమారుడు ఉత్తమ్ రాఘవన్, రాఘవేంద్రగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్లలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications