ప్రేమ తిరస్కరణ: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య
మహబూబ్నగర్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో టీవీ ఛానెల్ రిపోర్టర్ మృతి
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొడకండ్ల సమీపంలో రాజీవ్ రహదారిపై శుక్రవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా వీ6 ఛానెల్ రిపోర్టర్ ప్రసన్నకుమార్(35) మృతిచెందారు.
తన సోదరుడి పెళ్లి శుభలేఖను బంధువులకు అందించి తిరుగు ప్రయాణంలో కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రసన్నకుమార్ను కుకునూరుపల్లి పోలీసులు గజ్వేల్లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.