విషాదం: దళిత రైతు ఆత్మహత్య, తన మరణానికి ‘సీఎం’ కారణమంటూ లేఖ
ఆదిలాబాద్: జిల్లాలో రమాకాంత్ అనే ఓ దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కారణమని మృతుడు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు తనలాంటి పేద రైతులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను క్షమించాలని తన తల్లిదండ్రులను కోరాడు.
సూసైడ్ నోట్లో "కేసీఆర్ గారూ! నా చావుకి మీరే బాధ్యులు, భూములు ఉన్న రైతులకు రైతుబంధు ఇస్తున్నారు, నాలాంటి దళితులు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు' అని పేర్కొన్నాడు. యువ రైతు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

రైతుబంధు నిధులను వ్యవసాయ భూములు ఉన్న రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, భూమి లేని రైతులు, కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసే కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు కోసం దళిత రైతు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. భూ స్వాములకే రైతుబంధు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. సామాన్య కౌలు రైతులకు ఎలాంటి సాయం అందించడం లేదని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీలు కూడా అధికారంలోకి వస్తే కౌలు రైతులను కూడా ఆదుకుంటామని స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications