ఆ వంటలకు బ్రేక్: యూట్యూబ్ స్టార్ ''గ్రాండ్ పా కిచెన్'' నారాయణ రెడ్డి తాత మృతి
Recommended Video
కొద్ది నెలల క్రితం యూట్యూబ్ వంటల బామ్మ మస్తానమ్మ మృతి చెందిన విషయం మరువక ముందే మరో యూట్యూబ్ స్టార్ వంటల తాత నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ తాత నారాయణ రెడ్డి యూట్యూబ్లో 'గ్రాండ్ పా కిచెన్' పేరుతో నోరూరుంచే వంటలు చేస్తూ కొన్ని లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. నారాయణ రెడ్డికి ఒక్క భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. తాను చేసిన వంటలు తన కోసం కాకుండా అనాథలైన చిన్నపిల్లలకు వడ్డించేవారు.
అనాథ పిల్లల కోసం వంట వండే తాత
వంటల తాత నారాయణ రెడ్డి మృతి చెందాడని తెలుసుకున్న అభిమానులు తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్విటర్లో పోస్టులు పెట్టారు. ఆయన నడిపే యూట్యూబ్ ఛానెల్కు దాదాపు 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మృతి చెందిన సమయానికి నారాయణ రెడ్డి వయస్సు 73 ఏళ్లు. ఇక ఈ తాత వంటే వంటలు చూస్తే నోరూరుతుంది. నిజాం నవాబుల బిరియాని నుంచి ఆధునిక వంటలు అన్నీ వండుతారు. ఇక వండటం అంటే ఏదో ఇద్దరు ముగ్గురు తినేందుకు వండరు. కొన్ని వందల సంఖ్యలో అనాథ పిల్లల కడుపు నింపేందుకు ఆయన వంటలు చేస్తూ దాన్నే తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తారు. ఈ వంటల తాత చేస్తున్న మంచి పనిని చూసి పలువురు స్ఫూర్తిని పొందారు కూడా.
ఆలూ చిప్స్ దగ్గర నుంచి బర్గర్లు బిరియానీ వరకు...
నారాయణరెడ్డి వీడియోల నిడివి 12 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. అందులో తాను చేసే వంటల గురించి వివరిస్తారు. అవి ఎలా చేయాలో నేర్పుతారు. తనకు వచ్చి రానీ ఇంగ్లీషులోనే మాట్లాడుతూ వ్యూయర్స్ను ఆకట్టుకుంటారు. ఆలూ చిప్స్ దగ్గర నుంచి బర్గర్లు, బిరియాని వరకు అన్నీ వండి అనాథ పిల్లల కడుపులు నింపుతారు. అయితే ఎప్పుడూ ఈ వంటల తాత ఒక ఫిలాసఫీ చెబుతారు. ప్రేమించడం, పంచడం , మనవారని భావించడం అదే తన కుటుంబంగా చెప్పుకుంటారు. ఇది తన ప్రతి వీడియో మొదట్లో మనకు కనిపిస్తుంది. ఇక అదే యూట్యూబ్ ఛానెల్లో తన చివరి వీడియోను నిర్వాహకులు పోస్టు చేశారు.
ట్విటర్లో సంతాపం తెలిపిన అభిమానులు
ఇక తనకు వచ్చిన ఇంగ్లీషులోనే ఆ రోజు చేయబోయే వంట గురించి చక్కగా వివరిస్తారు. వంటల తాతయ్య తమకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చి వెళ్లిపోయారని అభిమానులు ట్విటర్లో పోస్టులు పెట్టారు. నారాయణరెడ్డి తాత ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మరికొందరు నెటిజెన్లు ట్వీట్ చేశారు. గరిట తిప్పారంటే ఘుమఘుమలే ఇక అవి తమకు దూరం అయ్యాయంటూ మరికొందరు ట్వీట్ చేశారు.