మానవత్వంతో ఆదుకోండి: చంద్రబాబు, కేసీఆర్లకు జగన్ సూచన, పరామర్శ
హైదరాబాద్: ఖమ్మం జిల్లా రోడ్డు ప్రమాద బాధితులను వైసీపీ అధినేత వైయస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన, అనంతరం వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు అందుకున్న చికిత్సపై జగన్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఖమ్మం రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న జగన్ వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. నాయకన్ గూడెం వద్ద బస్సు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారు రెండు మూడు నెలల పాటు పనిచేయలేరని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ వస్తుందని రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చే పరిస్థితి ఉందని అన్నారు.
కానీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ఎక్కడికి రావడం లేదని అన్నారు. ఆయన రాకపోయినా చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన ప్రతి కుటుంబానికి రూ. 50వేలు ఇవ్వాలని ఆయన సూచించారు.
11కు చేరిన మృతుల సంఖ్య
కాగా, సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఘటన జరిగిన వెంటనే పది మంది చనిపోగా, బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో మృతదేహం కొద్దిసేపటి క్రితం బయటపడింది. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది.
20మందికి తీవ్ర గాయాలు
మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదం జరగక ముందు ప్రయాణికులతో సహా, డ్రైవర్, క్లీనర్ భోజనం చేశారు. అనంతరం మరో డ్రైవర్ బస్సు డ్రైవింగ్ చేశాడు. ముందున్న డ్రైవరే బస్సు నడిపివుంటే ప్రమాదం జరిగివుండేది కాదని ప్రయాణికులు చెబుతున్నారు.
10మంది మృతులు కాకినాడ వాసులే
కాగా ప్రమాదంలో చనిపోయిన 10మంది మృతులు కాకినాడ వాసులే అని అధికారులు తేల్చారు. ఇదిలా ఉంటే ఖమ్మం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప రూ. 3 లక్షలో ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు.
మృతులు:
దుర్గారావ్, సుబ్బారెడ్డి, వానపల్లి రాజు, శ్రావణి (18), ప్రశాంత్ (22), విజయ, అజారిద్దిన్, మోక్ష, లక్ష్మి,అశోక్ అని తెలిసింది.
ప్రమాదంలో గాయపడిన వారు:
సత్యనారాయణ, బాలకృష్ణ, ధనలక్ష్మి,భాస్కర్రావు,లక్ష్మణ సతీశ్, ఫణి, వెంకటేశ్వర్లు, ప్రేమకుమారి, సూర్యకుమారి, నాగమణి, వెంకటసూర్యసాయి, లక్ష్మీమణి, గణేశ్లుగా అధికారులు గుర్తించారు. కాగా బస్సు డ్రైవర్ రంగారెడ్డి జిల్లా వాసి.. క్లీనర్ మహేశ్ మహబూబ్నగర్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం క్లీనర్కు ఓ కాలు పూర్తిగా విరిగిపోయినట్లు తెలిసింది. క్షతగాత్రులంతా ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ బస్సులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పిన జగన్, ఆ బస్సుకు సంబంధించి ఇన్సూరెన్స్ వెంటనే వచ్చేలా చేసి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బాధితులను మానవతా దృక్పతంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని అన్నారు.
ఈ ఘటనపై చంద్రబాబుని గానీ మరెవరినీ గానీ తప్పుపట్టడం లేదని అన్నారు. ప్రైవేట్ బస్సుల పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. మానవతా దృక్పతంతో బాధితులకు మనం భరోసా ఇవ్వాలని అన్నారు. బస్సులో గాయపడిన వారంతా ఆంధ్రా ప్రయాణికులు కాబట్టి వారిని ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట గతంలో రెండు సార్లు ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రద్ధ పెట్టాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా బ్రిడ్జి వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.