నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం -రాజకీయ భవిష్యత్ కు కీలకంగా : తండ్రి సమాధి వద్ద కన్నీటి పర్యంతం..!!
వైఎస్సార్ కుమార్తె...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా మరో ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ కాలం ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా ఇది కీలక మలుపుగా..షర్మిల రాజకీయ భవిష్యత్ కు టర్న్ గా ఈ పాదయాత్ర నిలవబోతోంది. తన పాదయాత్ర కు ముందుగా షర్మిల..తన తల్లితో కలిసి ఇడుపులపాయలో నివాళి అర్పించారు. ప్రార్ధనల సమయంలో తల్లి విజయమ్మ..షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

తండ్రి సమాధి వద్ద కన్నీటి పర్యంతం
కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరినొకరు హత్తుకుని ఓదార్చుకున్నారు. దీంతో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ఆ తరువాత ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ స్థాపించానని చెప్పిన షర్మిల... వైఎస్సార్ సంక్షేమ పాలన తెచ్చేందుకు ప్రజలు, అభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. తన తండ్రి సెంటిమెంట్ కొనసాగింపులో భాగంగా... ఉదయం 10గంటలకు తల్లి విజయలక్ష్మితో కలిసి శంకర్పల్లి అడ్డ రోడ్డు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

వైఎస్సార్ సెంటిమెంట్ కొనసాగిస్తూ
2003లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర, 2004, 2009లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి చేవెళ్ల నుంచే ప్రారంభించారు. సీఎం హోదాలో పలు సంక్షేమ పథకాలనూ ఇక్కడినుంచే మొదలుపెట్టారు. తండ్రి సెంటిమెంటు కోటలో.. షర్మిల పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
సభ లో పాదయాత్ర ఉద్దేశాలను వివరిస్తారు. సభా స్థలికి వైఎస్సార్ ప్రజాప్రస్థానంగా పేరు పెట్టారు. మరోవైపు షర్మిల పాదయాత్ర నేపథ్యంలో చేవెళ్లలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు.

ప్రారంభ సభలో కీలక ప్రసంగం
సభా వేదిక వద్ద వైఎస్, షర్మిల కటౌట్లు పెట్టారు. సభ అనంతరం అక్కడినుంచే.. 11.30కు విజయలక్ష్మి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2.5 కి.మీ దూరంలోని షాబాద్ చౌరస్తా వరకు కూతురితో కలిసి నడుస్తారు. వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు.
కిలోమీటర్ దూరంలో ఉన్న కందవడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం చేశాక 3 గంటల సమయంలో తిరిగి కొనసాగిస్తారు. కందవడ గ్రామంలో రచ్చబండ మాట-ముచ్చట కార్యక్రమం ద్వారా గ్రామస్థులతో షర్మిల మాట్లాడతారు.
Recommended Video

14 నెలలు...4 వేల కిలో మీటర్లు
తొలి రోజు షర్మిల పది కి.మీ పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు మొయినాబాద్ మండలం నక్కలపల్లిలో పాదయాత్రకు విరామమిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. దాదాపుగా 14 నెలల పాటుగా 4 వేల కిలో మీటర్లు 100 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా షర్మిల పాదయాత్ర సాగనుంది. గతంలో 2012 లో షర్మిల అన్న కు మద్దతుగా ..వైసీపీ కోసం పాదయాత్ర చేసారు. ఇప్పుడు తన రాజకీయ పార్టీ కోసం పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. మరి.. షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications