వైఎస్ షర్మిల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత: బస్సుకు నిప్పు, ఫ్లెక్సీల దగ్ధం
వరంగల్: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను అరెస్ట్ చేశారు నర్సంపేట పోలీసులు. పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే రక్షణ చర్యల్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాడులు చేసినవారిని కాకుండా మమ్మల్ని అరెస్టు చేస్తారా?
తమపై దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా.. పాదయాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని షర్మిల ప్రశ్నించారు. తమ పాదయాత్రకు అనుమతి ఉందని చెప్పారు. ఈ క్రమంలో వైయస్సార్టీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
షర్మిల కేరవాన్కు నిప్పు, ఫ్లెక్సీల దగ్ధం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. అంతేగాక, షర్మిల కేరవాన్కు.. టీఆర్ఎస్ నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్సార్టీపీ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. గోబ్యాక్ షర్మిల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
టీఆర్ఎస్పై విమర్శలతోనే దాడులు?
ఆదివారం జరిగిన నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై షర్మిల చేసిన విమర్శలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎంపీపీ విజేందర్, సర్పంచ్ కుమార స్వామి, నాయకులు చెన్నారెడ్డి ఉన్నారు.
నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు
షర్మిల బస చేసే ఏసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే మంటలను ఆర్పేశాడు. అయితే బస్సులో ఉన్న సిబ్బంది మంటలను గమనించి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటన పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దుండగులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications