కేసీఆర్ సర్కారు హామీలేమయ్యాయి? వైఎస్ చేస్తే వీరి గొప్పలు: ఎంతటి కొండనైనా ఢీకొంటానంటూ షర్మిల
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లా అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా, గురువారం లోటస్పాండ్లో కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

యావత్ తెలంగాణకు కరీంనగరే అద్దంపడుతుందన్న షర్మిల
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం.. సింగరేణి మనకు తలమానికమని అన్నారు. అగ్గిపెట్టెలో పెట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కరీంనగర్ జిల్లాతో విడదీయరాని బంధం ఉందన్నారు. వైఎస్ ఉచిత విద్యుత్.. కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలు చూసే ఇచ్చారని షర్మిల తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న సిరిసిల్ల నేతన్నలకు.. లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారని ఆమె చెప్పారు. నేతన్నలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారన్నారు.

కరీంనగర్ రౌస్ బౌల్ అయ్యింది వైఎస్ వల్లే.. వీరి గొప్పలు
కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అని అనడానికి వైఎస్సారే కారణమని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి, మిడ్ మానేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ దేనని అన్న షర్మిల.. ఇప్పుడేమో కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని, రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎస్దేనని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా అభివద్ధిలో వైఎస్ పాత్ర చాలా ఉందన్నారు.

కేసీఆర్ సర్కారు హామీలేమయ్యాయి..
ప్రాజెక్టులకు భూములు ఇచ్చినవారి త్యాగం వెలకట్టలేనిదని షర్మిల వ్యాఖ్యానించారు. ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని కేసీఆర్ సర్కారును షర్మిల ప్రశ్నించారు. నేరెళ్లలో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగాచారని మండిపడ్డారు. దళితులపై పాలకులకు ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందని షర్మిల ఎద్దేవా చేశారు.

ఎంతటి కొండనైనా ఢీకొంటానంటూ షర్మిల
పెద్దపల్లి న్యాయవాద దంపతుల హత్య కేసులో అధికార పార్టీ హస్తం ఉండటం దారుణమైన విషయమని అన్నారు. ఇంకా బొంబాయి, దుబాయికి వలసలు ఆగిపోలేదని, బీడీ కార్మికులను పట్టించుకోవడం లేదని రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తన సంకల్పమని, మీరంతా తోడుంటే అది సాధ్యమవుతుందని ఆత్మీసభలో అభిమానులనుద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. అభిమానుల అండ ఉంటే ఎంతటి పెద్ద కొండనైనా ఢీకొట్టడానికి తాను సిద్ధమని షర్మిల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications